వైసీపీలో బాలినేని కధ క్లైమాక్స్‌కు వచ్చేసిన్నట్లేనా?

MLA-Balineni-Srinivasa-Reddyమాజీ మంత్రి, సీనియర్ వైసీపీ నేత, ఒంగోలు జిల్లా రాజకీయాలను శాశిస్తున్న బాలినేని శ్రీనివాసుల రెడ్డి, పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఇటీవల రీజినల్ కన్వీనర్‌గా పదవికి రాజీనామా చేశారు. దానిని ‘వైసీపీలో తుఫాను’ అంటూ మీడియాలో వచ్చిన వార్తలపై వైసీపీ ప్రభుత్వానికి శల్యసారధ్యం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, “ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం. ఇక్కడ కప్పు లేదూ దానిలో టీ కూడా లేదు.. కనుక టీకప్పులో తుఫానూ లేదు,” అంటూ ఇదేం పెద్ద విషయం కాదన్నట్లు కొట్టిపడేశారు.

అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం బాలినేని శ్రీనివాసులు రెడ్డిని అర్జెంటుగా తాడేపల్లికి పిలిపించుకొని బుజ్జగించడానికి ప్రయత్నించారు. కానీ బాలినేని చల్లబడకపోగా బుజ్జగింపులు, రాయబారాలకు దూరంగా ఉండేందుకు హైదరాబాద్‌ వెళ్ళిపోయారు తప్ప సర్దుకుపోయానని ప్రకటన చేయలేదు. దీంతో వైసీపీలో తుఫాను నిజమేనని స్పష్టం అయ్యింది.

ADVERTISEMENT

ఈలోగా ఒంగోలులో ఆయన కార్యాలయం వద్ద జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్‌ను ఆయన అనుచరులు తొలగించిన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు రైల్లో వచ్చారు. ఇదివరకు ఆయన హైదరాబాద్‌ వెళ్ళివచ్చినప్పుడు కొందరు ముఖ్య అనుచరులు మాత్రమే స్టేషన్‌కి వచ్చి ఆయనకు స్వాగతం పలికేవారు. కానీ ఇవాళ్ళ సుమారు 2-300 మందికి పైగా బాలినేని అనుచరులు స్టేషన్‌కి వెళ్ళి ఆయనకు స్వాగతం పలికారు. వారిలో ఏ ఒక్కరూ వైసీపీ కండువాలు వేసుకోలేదు. ఎవరూ ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేయలేదు. అందరూ ‘జై బాలినేని’ అని మాత్రమే నినాదాలు చేశారు.

ఇక ఈ వీడియోని ‘టీమ్‌ బాలినేని’ సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. దానికి “రాజసం నీ ఇంటి పేరు…” అంటూ సాగే జైబాలయ్య పాటను జోడించి మరీ పెట్టింది. బాలినేని కూడా తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో అదే పాటతో ఆ వీడియోని పెట్టుకొన్నారు! అంటే వైసీపీలో బాలినేని కధ క్లైమాక్స్‌కు వచ్చేసిన్నట్లే ఉందిగా! మరి టీ లేదూ… కప్పూ లేదూ… తుఫానూ లేదంటారేంటి వైసీపీ శల్యసారధి సజ్జల రామకృష్ణారెడ్డి?

ADVERTISEMENT
Latest Stories