రాజకీయ నాయకులు పార్టీలు మారడం కొత్తేమీ కాదు కానీ వర్తమాన రాజకీయ పరిస్థితులలో ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చేసుకోవడం చాలా ప్రమాదకరమే అవుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నేతలు కప్పగంతులే ఇందుకు తాజా నిదర్శనం. తెలంగాణ ఏర్పడక మునుపు కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలలో పదవులు అనుభవించిన వారందరూ ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం అందరూ చూశారు.
అదేవిదంగా బిఆర్ఎస్ పార్టీలో ఐదేళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు టికెట్ రాకపోయే సరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారిప్పుడు.
కాంగ్రెస్లో ఎమ్మెల్యేలకి కేసీఆరే ఎన్నికల ఖర్చులు భరిస్తున్నారని, ఎన్నికల తర్వాత వారందరూ కేసీఆర్ చిటిక వేయగానే బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారని బీజేపీ వాదిస్తోంది. గతంలో వారు ఆవిదంగానే చేశారు కనుక ఈసారి కూడా అలాగే చేయవచ్చని ప్రజలు అనుమానించడం సహజమే. అనుమానిస్తే కాంగ్రెస్ ఓటమి కూడా ఖాయమే.
అంటే ఇతర పార్టీల నేతల ‘విశ్వసనీయత’ను పరిగణనలోకి తీసుకోకుండా పార్టీలో చేర్చుకోవడం ప్రమాదకరమని అర్దమవుతోంది.
అదే… హైదరాబాద్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ని బీజేపీ సస్పెండ్ చేసినప్పటికీ ఆయన పార్టీ మారాలనుకోలేదు. ఒకవేళ బీజేపీ తనకు మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలను వదిలేసి గోరక్షణ కోసం పోరాడుతూ హిందుత్వ సిద్దాంతాలకే కట్టుబడి పనిచేసుకొంటానని ఖరాఖండీగా చెప్పేశారు.
అందుకే బీజేపీ మళ్ళీ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి టికెట్ ఇచ్చింది. ఇలాంటి విశ్వసనీయత, పార్టీ సిద్దాంతాల పట్ల నమ్మకమున్న నేతలు ఇప్పుడు చాలా అరుదుగా కనబడతారు. వైసీపి ఇటువంటి నేతలు ఎంత మంది ఉన్నారు?
ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి టిడిపివైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైవీ సుబ్బారెడ్డి వలన ఇబ్బంది పడుతున్న బాలినేని టిడిపివైపు చూస్తుండగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిక్కుకొన్న మాగుంట తండ్రీ కొడుకులను జగన్ పట్టించుకోకపోవడం వలన వారు కూడా టిడిపివైపు చూస్తున్నారు. వారిద్దరూ చాలా బలమైన నేతలే. కనుక టిడిపికి సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వైసీపి నుంచి ఎమ్మెల్యేలు మేకపాటి, ఆనం కోటంరెడ్డి, (ఆయన సోదరుడు), శ్రీదేవి చేరారు. ఇప్పుడు బాలినేని, మాగుంటలను కూడా టిడిపిలో చేర్చుకొంటే, ఆ స్థానాల నుంచి పోటీ చేయాలనుకొంటున్న టిడిపిలో సీనియర్ల పరిస్థితి ఏమవుతుంది?
ఆ సీట్లలో కొన్నిటిని జనసేనకు ఇవ్వాల్సివస్తే వారిని సముదాయించగలదా?ఒకవేళ టిడిపిలోని సీనియర్లను, జనసేనను కూడా పక్కన పెట్టి వైసీపి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చుకొంటూ పోతే, రేపు ఎన్నికల తర్వాత వారు కూడా తెలంగాణ కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలాగే జగన్ చిటికేస్తే మళ్ళీ వైసీపిలోకి వెళ్ళిపోరనే గ్యారెంటీ ఏమిటి?
వారందరూ వైసీపిలో ఇమడలేకనో, వేరే కారణాలతోనో టిడిపిలోకి వస్తారే తప్ప బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్లాగ టిడిపి పట్ల నిబద్దత, విశ్వసనీయతతో రావడం లేదు కదా?
కనుక వైసీపి నేతలను టిడిపిలోకి తీసుకొనే ముందు టిడిపి అధిష్టానం, జనసేన కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. లేకుంటే మరోసారి వైసీపికి బలైపోయే ప్రమాదం ఉంటుంది.




