వారి ట్వీట్స్ సారాంశం ఏమిటంటే దొందుకు దొందే!

Bandi Sanjay Kavithaతెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా ఒకరి ప్రభుత్వంపై మరొకరు బాణాలు సందించుకొన్నారు. ఇద్దరూ చాలా ధీటుగా స్పందించిన మాట వాస్తవం. అయితే వాటితో సామాన్య ప్రజలకు అర్దమయ్యేది ఏమిటంటే దొందుకు దొందూ దొందప్పలే అని! కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని బండి సంజయ్‌ ట్వీట్‌ చేస్తే, ఢిల్లీలో మహిళా రెజ్లర్స్ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా వారిని లైంగికంగా వేధించిన బిజెపి ఎంపీని మోడీ ప్రభుత్వం వెనకేసుకువస్తుంది తప్ప చర్యలు తీసుకోదని కల్వకుంట్ల కవిత ఘాటుగా సమాధానమిచ్చారు.

ముందుగా బండి సంజయ్‌ ఏమి ట్వీట్‌ చేశారంటే, “గవర్నర్‌కు దక్కదు గౌరవం, ఆడబిడ్డలకు లేదు అండ, గిరిజన మహిళలపై పోలీస్‌ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం, ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం…. అదిరింది కేసీఆర్‌ నీ మహిళా సంక్షేమం.”

ADVERTISEMENT

దీనికి కల్వకుంట్ల కవిత ఏమి జవాబు చెప్పరంటే, “పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం, దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు.

దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం, నినాదాలకే పరిమితమైన భేటీ బచావో… భేటీ పడావో, సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి, మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం, ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం, ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది.”

దీనికి బండి సంజయ్‌ మళ్ళీ అంతే ఘాటుగా స్పందిస్తూ, “సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం, ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం, పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్ళేసిన వైనం, పసి బిడ్డ నుండి పండు ముసలి వరకూ ఎవరికీ లేని రక్షణ,

తొలి క్యాబినెట్లో కనీసం ఒక్క మహిళలకూ దక్కని ప్రాతినిధ్యం, పాయఖానాలు సైతం లేక ఆడకూతుర్లు అవస్థలు పడుతుంటే స్పందించని నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేసి మహిళల్ని గోస పెడుతూ అలసత్వం, బాలింతలు మృతి చెందినా పరామర్శించని కర్కశత్వం, రాజకీయాల కోసం మహిళా బిల్లంటూ వీధులకెక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళా లోకం ఏనాడో పసిగట్టింది.. గులాబీ పార్టీ పని పడుతుంది,” అని ట్వీట్‌ చేశారు.

వారిరువురూ పరస్పరం చేసుకొన్న విమర్శలు, ఆరోపణలు నూటికి నూరుశాతం నిజం. అంటే ఇక్కడ కేసీఆర్‌ ప్రభుత్వం మహిళల పట్ల ఏవిదంగా వ్యవహరిస్తోందో, అక్కడ మోడీ ప్రభుత్వం కూడా అదేవిదంగా వ్యవహరిస్తోందని వారే బయటపెట్టుకొన్నారు… గ్రేట్ కదా!

ADVERTISEMENT
Latest Stories