త్రివిక్రమ్ – పవన్ కలయికలో తెరకెక్కిన “అజ్ఞాతవాసి” ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా సాగిన ఈ వేడుకలో ఎక్కువ శాతం సమయం బోరింగ్ గా సాగడం విశేషం. సాధారణంగా పవన్ ఫంక్షన్స్ అంటే ఫుల్ జోష్ లో ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక చప్పగా ముగిసింది.
దీనికి ప్రధాన కారణం… పవర్ స్టార్ అభిమానులకు కావాల్సిన బండ్ల గణేష్ వంటి అరవీర ప్రసంగికులు లేకపోవడమే. పవన్ గురించి బండ్ల మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా ఈ తరహా ప్రసంగాలను పవర్ స్టార్ ఫ్యాన్స్ మిస్సయ్యారు. బహుశా ఆ లోటును పూడ్చేందుకు బండ్ల ట్విట్టర్ ను వేదికగా ఎంచుకున్నారో ఏమో గానీ పవన్ పై లేటెస్ట్ గా ఓ ట్వీట్ చేసారు.
“మాటల్లో నీతి.., కళ్ళల్లో నిజాయితీ.., గుండెల్లో పౌరుషం.., రక్తంలో దమ్ము.., మీ సొంతం బాస్…” అంటూ పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేసి ‘టైగర్’ సింబల్ ను పోస్ట్ చేసారు. పవన్ ఫ్యాన్స్ కు ఇలాంటి మాటలు ఎంత ఖుషీని చేస్తాయో అందరికీ తెలిసిందే. దీంతో ఈ ట్వీట్ కు సహజంగానే లైక్స్ ల వర్షం కురుస్తోంది.



