భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 5న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తే 8వ తేదీ నుంచి విమానాల రాకపోకలు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో అనుకున్న తేదీకి విమానాశ్రయం ప్రారంభోత్సవం కాలేదు. విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ త్వరలో ప్రారంభోత్సవం తేదీ ప్రకటిస్తామని చెప్పారు.
ఈ విమానాశ్రయానికి లైసెన్స్ పత్రాన్ని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు. దీంతో పాటు విమానాల నిర్వహణ, మరమత్తుల కేంద్రం, ఎయిర్ కార్గో వ్యవస్థ కూడా ఏర్పాటవుతుంది. ఈ విమనాశ్రయం చుట్టుపక్కల అనేక స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్, కన్వెన్షన్ సెంటర్లు వగైరా కూడా రాబోతున్నాయి. కనుక భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి,” అని చెప్పారు.
భోగాపురం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు సాగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది కనుక జీఎంఆర్ కుటుంబ సభ్యులు భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం విశాఖ నగరానికి, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలకు మధ్యలో జాతీయ రహదారికి సమీపంలో ఉంది. కనుక ఇది అందుబాటులోకి వస్తే మూడు జిల్లాల ప్రజలకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.




