నేడు బీహార్ శాసనసభ రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోపక్క తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో నిన్న ఢిల్లీలో కారు బాంబు ప్రేలుడు జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర చనిపోయారంటూ ప్రముఖంగా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అయన చనిపోలేదంటూ భార్య హేమమాలిని, కూతురు ఇషా డియోల్ ఖండన వార్త కూడా మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
బీహార్లో సాధారణ సమయాల్లోనే హింసాత్మక ఘటనలు జరుగుతుంటాయి. ఎన్నికల సమయంలో ఇంకా ఎక్కువగా జరుగుతుంటాయి.
ఈసారి ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి, గెలిచి అధికారం నిలుపుకోవాలని ఎన్డీయే కూటమి, ‘కింగ్’ కాలేకపోయినా కనీసం ‘కింగ్ మేకర్’ అవ్వాలని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చాలా పట్టుదలగా కృషి చేశారు.
పోటీ చాలా తీవ్రంగా సాగింది కనుక అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. కనుక సజావుగా పోలింగ్ నిర్వహించడం ఎన్నికల సంఘానికి కత్తి మీద సామే అని చెప్పవచ్చు.
ఈ రెండవ మరియు చివరి దశ పోలింగులో 20 జిల్లాలలో 122 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతోంది. నిరక్షరాస్యులు, గ్రామీణులు ఎక్కువగా ఉండే బీహార్లో మధ్యాహ్నం 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదు కాగా, ధనవంతులు, ఉన్నత విద్యావంతులు అధికంగా నివాసమున్న జూబ్లీహిల్స్లో మధ్యాహ్నం 11 గంటల వరకు కేవలం 20.76 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం విశేషం.
రాజమౌళి, తనికెళ్ళ భరణి, పలువురు మంత్రులు, ప్రముఖులు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కానీ 2014 ఎన్నికలలో 50.18 శాతం, 2018లో 45.49 శాతం, 2023లో 45.59 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం ప్రకారం చూస్తే ఈసారి కూడా అంతే లేదా అంత కంటే తక్కువే ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
మూడు ప్రధాన పార్టీలో హోరాహోరీగా ప్రచారం చేసినప్పుడు వేలాదిమంది తరలివచ్చారు. కానీ ఎంత ప్రచారం చేసినా ఎంత డబ్బు పంచినా ఓట్లు వేయడానికి జనాలు రావడం లేదు!







