పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మొదటి అంకం చివరి రోజు సైతం ఏపీకి అన్యాయం అనే అంశం కుదిపివేసింది. తెలుగు ఎంపీలు ఎక్కడా తగ్గకుండా సభను హోర్రెతించడంతో సభను వచ్చే నెల 5వ తారీఖుకు వాయిదా వేశారు. నిన్న విత్త మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయంపై మరోసారి ప్రకటన చేసారు.
పాడిందే పాట రా… అన్న చందాన అదే పాత పాట పడ్డారు ఆయన. దీనిబట్టి ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా ఇంకేమి చేసే ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తుంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి బేస్ లేదు, ఇక్కడ ఆ పార్టీ పెద్దగా నష్టపోయేది ఏముందిలే అనే ధోరణి వారిలో కనిపిస్తుంది. 2014లో సొంతగా వచ్చిన మెజారిటీ ఈ గర్వానికి కారణం అయ్యుండొచ్చు.
అయితే అతిసమీపంలో తెలుగువారి నుండి బీజేపీకి ప్రమాదం పొంచి ఉంది. మర్చి నెల నుండి ఎప్పుడైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు. కర్ణాటకలోని రాయచూరు, బెంగళూరు పరిసర ప్రాంతాలలో తెలుగువారి ప్రాభల్యం ఎక్కువ. బీజేపీకి మద్దతుదారులు ఎక్కువ. అయితే ఏపీకి వారు చేస్తున్న అన్యాయం అక్కడ వారిపై ప్రభావం చూపిస్తే ఘోరపరాభవం తప్పదు.
దక్షిణాన బీజేపీకి పట్టు ఉన్న ఒకే రాష్ట్రం కర్ణాటక. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అక్కడ ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో ఉంది కమలం పార్టీ. అక్కడి తెలుగువారి మద్దత్తు కోసమైనా మార్చి నెలలో ఏపీకి ఏదోఒకటి ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం ఏమి జరగబోతుందో?



