తొమ్మిదేళ్ళ మోడీ పాలనలో దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ది, అమలవుతున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించేందుకు ఏపీ బిజెపి అధ్వర్యంలో శనివారం శ్రీకాళహస్తిలో ‘మహాజన్ సంపర్క్’ పేరుతో బహిరంగసభ జరిగింది.
ఆ సభలో ప్రసంగించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదన్నారు. ఇసుక, మద్యం, భూములు, కొండలు, అన్నిటినీ దోచుకొంటోందన్నారు. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతగా సహాయసహకారాలు అందిస్తున్నా వైసీపీ అవినీతి పాలన వలన భ్రష్టు పట్టిపోతోందన్నారు. ఆ తర్వాత ఆయన మోడీ భజన చేసి, ఈసారి బిజెపికి ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
అయితే జేపీ నడ్డా నోటి నుంచి రాష్ట్ర ప్రజలు ఏమి వినాలని ఎదురుచూస్తున్నారో అది మాత్రం వినబడలేదు!
‘బిజెపికి ఒక్క ఛాన్స్’ ఇమ్మనమని, తమకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని భాగుచేస్తామని జేపీ నడ్డా అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనకూ ఒక్క ఛాన్స్ ఇమ్మనమని, తాను ముఖ్యమంత్రినైతే రాష్ట్రాన్ని బాగుచేస్తానని అంటున్నారు. అంటే రెండు పార్టీలు కలిసి ఉన్నట్లా లేనట్లా?ఏపీలో బిజెపి ఒంటరిగా పోటీ చేయబోతోందా?అనే విషయం నడ్డా ఈ సభలో స్పష్టం చేసి ఉంటే బాగుండేది. కానీ చేయలేదు!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ‘అవినీతి ప్రభుత్వం’ అని జేపీ నడ్డా సర్టిఫికేట్ ఇచ్చేశారు. కనుక ఢిల్లీ పెద్దలు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని, సిఎం జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఉంచుతారా?కాదనే అందరికీ తెలుసు. వైసీపీ అవినీతి ప్రభుత్వమని ఇక్కడ బహిరంగసభలో ప్రకటించి, అక్కడ ఢిల్లీలో ఇదే వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండటమంటే అర్దం ఏమిటి?
పవన్, జగన్, చంద్రబాబులను ఢిల్లీకి పిలిపించుకొని వారితో అమిత్ షా మాట్లాడిన తర్వాత, జేపీ నడ్డా ఏపీలో నిర్వహించిన తొలి సభ ఇది. కనుక దీనిలో ఏపీ రాజకీయాలలో బిజెపి వైఖరిని స్పష్టం చేస్తారనుకొంటే, మళ్ళీ పాత పాటే పాడి తమ ఆలోచనలలో, వైఖరిలో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేశారు.
వైసీపీతో ఏపీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లు వ్యవహరిస్తూ బిజెపి కూర్చోన్న కొమ్మను నరుక్కొంటోందని చెప్పక తప్పదు. అలాగే దక్షిణాది రాష్ట్రాలలో ‘మోడీ భజన’ చేసినా ప్రయోజనం ఉండదని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రుజువైనా బిజెపి తీరు మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ మండుటెండల్లో ఈ బహిరంగసభకి ఇంత జనసమీకరణ చేసి, విజయవంతం చేయడానికి రాష్ట్ర బిజెపి నేతలు ఎంతగానో శ్రమించి ఉంటారు. కానీ ఇంత కష్టపడినా ఏమి సాధించగలిగారు?రన్నింగ్ రేసులో పాల్గొనే క్రీడాకారులు తమ గమ్యంవైపు మాత్రమే పరిగెడితేనే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎటో అటు పరిగెడితే ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదు. ఏపీ బిజెపి కూడా ఇలాగే అగమ్యంగా పరిగెడుతోందని చెప్పవచ్చు. సరైనా విధానం, స్పష్టమైన వైఖరి లేకుండా ఎంత చెమటోడ్చినా ప్రయోజనం ఉండదని గ్రహిస్తే మంచిది.



