కేసీఆర్‌ ‘ఆన్‌-ఆఫ్’ యుద్ధాలతో విశ్వసనీయత ప్రశ్నార్ధకం!

KCR-Narendra-Modiతెలంగాణ సిఎం కేసీఆర్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో చాలా సన్నిహితంగా ఉండేవారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రానికి మద్దతు ఇస్తున్నామని గట్టిగా సమర్ధించుకొనేవారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో దాని స్థానంలోకి బిజెపి ప్రవేశించి శరవేగంగా ఎదిగి బిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడేసరికి, కేసీఆర్‌ వైఖరి మారిపోయింది.

అంతకు ముందు నిత్యం కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకొని యుద్ధం చేసే బిఆర్ఎస్‌ పార్టీ, ఆ తర్వాత నుంచి బిజెపిని టార్గెట్ చేసుకొని యుద్ధం మొదలుపెట్టింది. అయితే ఇక్కడే కేసీఆర్‌ మరో పెద్ద తప్పటడుగు వేసిన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో బిజెపి బలపడకుండా నిలువరించే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసుకొని యుద్ధం ప్రారంభించారు. బహుశః జాతీయ రాజకీయాలలో ప్రవేశించి చక్రం తిప్పాలనే కోరిక కూడా అందుకు ఓ కారణం కావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించేయడంతో, అప్రయత్నంగా ఆయనే తెలంగాణలో బిజెపికి మరింత గుర్తింపు కలిగేలా చేశారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్‌ చేసేందుకు సిద్దపడటంతో బిజెపితో కేసీఆర్‌ పోరాటం పతాకస్థాయికి చేరుకొంది. అయితే రెండు పార్టీల మద్య ఏదో రహస్య ఒప్పందం జరిగిన్నట్లుగా హటాత్తుగా ఈడీ చల్లబడిపోగా, కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా కేసీఆర్‌ అటువైపు తొంగిచూడలేదు!ఆ తర్వాత నుంచి కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్‌ నేతలెవరూ ప్రధాని నరేంద్రమోడీని పల్లెత్తుమాట అనడం లేదు. అంటే శాంతి ఒప్పందం జరిగిందనుకోవచ్చు.

ఆ ఒప్పందాన్ని పూర్తిచేసేందుకే కేసీఆర్‌ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఢిల్లీ వెళ్ళి రాజ్‌నాధ్ సింగ్‌ తదితర కేంద్ర మంత్రులతో వరుస భేటీలవుతున్నారు. పాట్నాలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ సమావేశమయ్యి కూటమి ఏర్పాటు గురించి చర్చిస్తున్నప్పుడే కేటీఆర్‌ కేంద్రమంత్రులతో భేటీ అవడం యాదృచ్చికం కాదనే భావించవచ్చు.

బిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళు, కాలేజీలు, కార్యాలయాలపై ఐ‌టి, ఈడీ దాడులు జరిగిన మర్నాడే ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలవడం అసలే యాదృచ్చికం కాదని భావించవచ్చు.

అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వడంలేదని, ఇవ్వకపోయినా తామే ప్రాజెక్టులు పూర్తిచేసుకొంటున్నామని చెప్పుకొంటునప్పుడు మళ్ళీ కేటీఆర్‌ ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులనుకలిసి నిధులు, ప్రాజెక్టుల గురించి చర్చించాల్సిన అవసరం లేదు కదా?కానీ భేటీ అవుతున్నారంటే బిజెపి-బిఆర్ఎస్‌ సంబంధాలను పునరుద్దరించుకోవడానికే కావచ్చు.

ఈ వాదనలు నిజమా కావా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ బాగానే అందిపుచ్చుకొంటోంది. బిజెపి, బిఆర్ఎస్‌ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని తాము మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నామని, ఇప్పుడు అదే జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గట్టిగా వాదిస్తున్నారు.

బహుశః కేసీఆర్‌ వ్యూహం మార్చుకొని ముందుకు సాగుతున్నారనుకొన్నా ఈవిదంగా చేస్తుండటం వలన బిఆర్ఎస్‌ విశ్వసనీయతను దెబ్బ తింటుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీయే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories