దేశంలో బీజేపీ రాజకీయంగా అశ్వమేధ యాగం చేస్తుందా అన్నట్టుగా ఒక్కోరాష్ట్రంలో బీజేపీ జెండా పాతుకుంటూ ముందుకెళుతోంది. అటువంటి బీజేపీ విజయ యాత్ర ఒక్క దక్షిణాదిన మాత్రం సానుకూల ఫలితాలను ఇవ్వలేకపోతుంది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కూటమితో అధికారం లోకి వచ్చిన బీజేపీ ఒక్కసారి ఆ కూటమి బలాన్ని కోల్పోతే తిరిగి యధాస్థానానికి పరిమితం కావాల్సిందే. ఉనికి కోసం పోరాడాల్సిందే. ఇక దశాబ్దాలుగా తెలంగాణలో అధికారం అంటూ కలలు కంటున్న బీజేపీ అధిష్టానం కలలను ఎప్పటికి పగటి కలలుగానే ఉంచేందుకు టి. బీజేపీ నేతలు తమవంతు సాయం చేస్తూనే వస్తున్నారు.
బండి నాయకత్వంలో తెలంగాణ రాజకీయాలలో దూకుడుగా ముందుకెళ్లిన బీజేపీ, ఒక్కసారిగా నాయకత్వ మార్పుతో అంతే వేగంగా వెనక్కి పోయింది. ఇక ఇప్పుడు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇక బిఆర్ఎస్ లో మంత్రిగా చేసిన, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన ఈటెల రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రజా బలమున్న రాజకీయ నాయకుడు చేరిక కూడా టి. బీజేపీ కష్టాలను తీర్చలేకపోతుంది.
బండి సంజయ్ – ఈటెల – అర్వింద్ మధ్య అంతర్గత విభేదాలు నడుస్తున్నాయంటూ తెలంగాణ వ్యాప్తంగా గట్టి ప్రచారమే జరుగుతుంది. అందుకు తగ్గట్టే అక్కడ రాజకీయ పరిణామాలు సాగుతున్నాయి. బండి సంజయ్ అరెస్టు వెనుక పలానా అంటూ ప్రచారాలు సాగడం, ఈటెల రాజకీయ ఎదుగుదలకు బండి అడ్డంకి గా మారారంటూ కథనాలు ప్రచారం అవ్వడం,
ఇక బండి ఏడుపే బీజేపీ న్నీ రాజకీయాయంగా ముందుకువెళ్లనివ్వకుండా చేస్తుంది అంటూ ఈటెల టార్గెట్ గా ఫ్లెక్సీలు వెలవడం ఇలా టి. బీజేపీ అంతర్గత రాజకీయాల గురించి మీడియాలో సోషల్ మీడియాలో బహిరంగ ప్రచారాలే జరుగుతున్నాయి.
ఇక అన్నా డీఎంకే తో రాజకీయ పొత్తు పెట్టుకుని 2026 ఎన్నికల బరిలో దిగిన బీజేపీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనితో తమిళనాడు బీజేపీ కి ఇన్నాళ్ళుగా బలంగా నిలబడిన అన్నా మలై బీజేపీ కి గుడ్ బై చెప్పనున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి.
బీజేపీ పట్ల తమిళ ప్రజలలో ఈ స్థాయి అసంతృప్తి ను చూసిన అన్నామలై అతిత్వరలో బీజేపీ కి రాజీనామా చేసి మరోకొత్త పార్టీ తో తమిళ రాజకీయ అడుగుపెట్టబోతున్నారు అంటూ అన్నామలై వార్తలతో అటు సోషల్ మీడియా ఇటు మెయిన్ స్టీమ్ మీడియా కథనాలను ప్రచారం చేస్తుంది.
అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని, వాటిలో వాస్తవం లేదంటూ పార్టీ స్టేట్ సెక్రటరీ vp సెల్వం ఈ వార్తలను ఖండిస్తున్నారు. అయితే నిప్పు లేనిదే పొగరాదనేది ఎంత వాస్తవమో అలాగే లీకులు లేనిదే రూమర్స్ రావనేది కూడా అంతే కఠిన వాస్తవం అనేది బీజేపీ గ్రహించడం లేదు.
ఇలా దక్షిణాదిన బీజేపీ నాయకత్వ సమస్యతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ నాయకత్వ సమస్య లోపం రాష్ట్ర నాయకులదా.? లేదా అధిష్టాన పెద్దలదా.? సమస్య పరిష్కారం మీద ద్రుష్టి పెట్టకపోవడం అధిష్టానం యొక్క నిర్లక్ష్యం అనాలా.? లేక రాష్ట్రంలో పార్టీ ని ముందుకు తీసుకెళ్లలేని రాష్ట్ర స్థాయి నాయకుల చేతకాని తనమనాలా.?. తప్పెవరిదైనా దక్షిణ భారతం బీజేపీ కి ఎప్పటికి అందని ద్రాక్షే అవుతుందా.?




