చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్రపై తెలుగుదేశం పార్టీ నేతలే మౌనం వహిస్తున్న తరుణంలో బ్లూ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు అటు వైసీపీని కూడా ఇరుకునపడేసేలా ఉన్నాయి.కేంద్ర పెద్దల అనుమతి లేకుండా జగన్ ప్రభుత్వం బాబుని అరెస్ట్ చేసే సాహసం చేయగలదా? అనే సందేహం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మదిలో మెదిలింది.
కానీ పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయగలిగిన వారే కరువయ్యారు.చివరకు ఆపనిని కూడా బ్లూ మీడియా తన కథనాల ద్వారా దిగ్విజయంగా పూర్తి చేసిందనే చెప్పాలి. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి.టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా లేదా అన్న మీమాంసలో నుంచి ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బయటకొచ్చారు. జనసేన – బీజేపీ పొత్తులో ముందుకెళ్తున్నాయా లేదా అనే సందేహానికి కూడా పవన్ అవనిగడ్డ సభలో కొంతవరకు క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ మహమ్మారికి టీడీపీ – జనసేన గెలుపే విరుగుడు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా వైసీపీ మద్దతుదారు మీడియాలో కొన్ని కథనాలు ప్రచారం చేస్తున్నారు. ముందు నుంచి పొత్తులో ఉన్న బీజేపీని వదిలి పవన్ టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి అడుగుపెట్టాలని చూస్తుండడం అటు కేంద్ర పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించిందని పవన్ మీద కోపం బీజేపీ చంద్రబాబు మీద చూపుతుందని కథనాలు రాసుకుంటూ పోతున్నారు.
పవన్ చేసిన ఈ పనికి బీజేపీ చంద్రబాబుని విడిచి పెడుతుందా? అంటూ బాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందనే సత్యాన్ని పరోక్షంగా రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేసినట్లే అయ్యింది. చంద్రబాబు కేసులు వాయిదాల మీద ముందుకెళ్లడానికి, విచారణలు టీవీ సీరియల్స్ మాదిరి సాగడానికి కారణం ఇదేనేమో మరి. ఇటువంటి కథనాలతో బీజేపీ అటు వైసీపీ మీద కూడా ఆగ్రహం తెచ్చుకుంటే మరి వైసీపీ లో ఎవరిని పట్టుకుంటుందో కూడా ఒక్కసారి ఆలోచించాలిగా!
తన తండ్రి అరెస్టులో ఎవరి పాత్ర ఎంత అనేది తెలిసినా తన విమర్శలను రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే పరిమితం చేసిన లోకేష్ మనోవేదనకు ఈ కథనాలు కొంత వరకు ఊరటను కలిగిస్తాయేమో! చూడాలి మరి! కేంద్ర ప్రభుత్వాలు వ్యక్తిగత కక్షలకు పాల్పడితే రాష్ట్రాలలో అశాంతి – అల్లర్లే రాజ్యమేలతాయి. అది దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.





