వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా గండిపేటలోని అత్యంత ఖరీదైన 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని బ్రాహ్మనాయుడు కబ్జా చేసేందుకు సిద్ధమైనట్లు అధికారుల విచారణలో తేలింది.
అందుకోసం నకిలీ పత్రాలను సృష్టించి, నకిలీ జీవో లను ప్రచారం చేసి ఆ ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా మార్చేందుకు బొల్లా తీవ్రంగా ప్రయత్నించినట్టు సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేటతెల్లమయింది. దానికి తోడు రెవెన్యూ అధికారుల సంతకాలను, వారి సీళ్లను కూడా ఫోర్జరీ చేసేందుకు బొల్లా వెనుకాడలేదు అనేది స్పష్టమయ్యింది.
దీనితో సైబరాబాద్ పోలీసులు నరసరావు పేటలోని బ్రహ్మనాయుడి నివాసంలో సోదాలకు వెళ్లగా ఆయన అప్పటికే పరారీలో ఉన్నట్లు తేలింది. ఇక నాటి నుంచి బొల్లా కోసం వేట మొదలుపెట్టిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో అరెస్టు చేసి భారీ భద్రత నడుమ హైద్రాబాద్ తరలించారు.
అలాగే సదరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే ను వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టి రిమాండ్ కి తరలించారు. అయితే ఈ కేసులో వైసీపీ నేత బొల్లా తో సహా మరో 9 మంది పై కేసులు నమోదయ్యాయి. ఇలా వైసీపీ లో సింహ భాగం ఎమ్మెల్యే లు ఏదోఒక అవినీతి కేసులోనో, అక్రమ భూదందాల కేసులలోనే అరెస్టయ్యి జైలుకి వెళ్లడం వైసీపీ పార్టీ రాజకీయ సిద్ధాంతానికి అద్దం పడుతుంది.
లిక్కర్ కేసు నుంచి బెదిరింపు కేసుల వరకు, భూ కబ్జా ల కేసు నుంచి నకిలీ జీవో ల సృష్టి, హత్య కేసు నుంచి దాడులకు పాల్పడిన కేసుల వరకు ఇలా వైసీపీ నేతల అరాచకాలకు కాదేది అనర్హం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు, మాజీ మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో పలురకాల కేసులలో అరెస్టయ్యి జైళ్లల్లో ఉన్నారు, మరికొంతమంది బైళ్ళతో బయటకు వచ్చారు.
ఇక ఇప్పుడు తాజాగా మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఏకంగా పొరుగు రాష్ట్రంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు సిద్ధపడ్డారు. మరి ఈ కేసును కూడా వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని సమర్థిస్తారా.? లేదా ఇందుకు కూడా బాబే కారణం అంటూ ఆవు పాఠం అందుకుంటారా.?




