ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మిస్తుంటే భారీగా అవినీతి జరిగిపోతోందని వైసీపీ దుష్ప్రచారం చేయని రోజంటూ లేదు. దాని సొంత మీడియా కూడా ఉడతాభక్తిగా కథలు అల్లి దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది.
కానీ తిరుమల కల్తీ నెయ్యి, మద్యం కుంభకోణం, వివేకా హత్య కేసు, అక్రమాస్తుల కేసులన్నీ రాజకీయ కక్షపూరితమైన తప్పుడు కేసులే వాటిలో తామందరం బాధితులమే తప్ప దోషులం కామని వైసీపీ నేతలు, వారి సొంత మీడియా వాదిస్తుంటుంది.
సరే! అవన్నీ తప్పుడు కేసులే… రాజకీయ కక్ష సాధింపులే అని పక్కన పెట్టేసినా హైదరాబాద్ శివారు గండిపేటలో సర్వే నం.18లో సుమారు వెయ్యి కోట్లు విలువైన భూమిని కాజేసేందుకు వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి నిర్వాకంపై స్పందించాలి కదా?
ఆ భూమిని క్రమబద్దీకరిస్తూ నకిలీ జీవోలు కూడా సృష్టించే సాహసం చేస్తే వైసీపీ, దాని సొంత మీడియాలో ఆయన నిర్వాకం గురించి చిన్న వార్త రాలేదు. దానిని ఆయన ఇతరులకు అమ్మబోతే ఆ నకిలీ జీవోల వ్యవహారం బయటపడింది.
ఆయనని, ఈ జీవోలు సృష్టించిన ఈ డీల్ చేయడానికి సహకరించిన వారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ మీద జైలుకి పంపారు.
ఇలాంటి దురాలోచనలు, నేర ప్రవృతిగలవారిని పార్టీలో పెట్టుకొని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా అవినీతి ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తుండటం చాలా విడ్డూరంగా ఉంటుంది. కనీసం ఇప్పటికైనా బొల్లా బ్రహ్మ నాయుడు చేసిన పని తప్పు అని చెప్పడానికి ఇష్టపడటం లేదంటే అర్థం ఏమిటి?
జనసేనాని హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి మాట్లాడితే అయనపై కల్వకుంట్ల కవితతో సహా అందరూ విరుచుకుపడ్డారు. అయన పేరిట రిజిస్టర్డ్ అయిన భూమిని కబ్జా చేసి కొట్టేసిన ప్రభుత్వ భూమి అని వాదించారు. కానీ నకిలీ జీవోలు సృష్టించి వెయ్యికోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని ఏపీ చెందిన నేత కొట్టేయాలని ప్రయత్నిస్తే అందరూ మౌనమే! దేనికి? అయన వైసీపీకి చెందినవారనా?




