వచ్చే ఎన్నికలలో టిడిపి-జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయంటూ నిన్న పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టేశారు కనుక ఇప్పుడు వైసీపి నేతల వంతు వచ్చింది. అప్పుడే మంత్రులందరూ మీడియా, సోషల్ మీడియాలో తమ పాచిపాట మొదలుపెట్టేశారు. వారిలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఒకరు.
“ఈ పొత్తులు, జిత్తులు వైయస్ఆర్ సీపీని ఏమి చేయలేవు అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలి, గిట్టని వారందరిపై కక్ష తీర్చుకోవాలి అన్న దురాలోచన తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వీరిలో @ncbn @PawanKalyan ఏ మాత్రమైనా కనబడుతుందా? ఇలాంటి పొత్తులు ఎన్ని పొడిచినా ప్రజాబలం మెండుగా ఉన్న జగన్ గారిని ఏమీ చేయలేవు. రాష్ట్ర ప్రజలతోనే మా పొత్తు, ఎప్పటికీ వారి సంక్షేమమే మా ధ్యేయం. వారే మా బలం,” అంటూ బొత్స ట్వీట్ చేశారు.
అయితే ఆయన చేసిన ఈ ట్వీట్ టిడిపి, జనసేనల గురించి కాక తమ ‘వైసీపి ధోరణి’ గురించే ఆయన చెప్పుకొంటున్నట్లు ఉండటం విశేషం. “అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలి, గిట్టని వారందరిపై కక్ష తీర్చుకోవాలి అన్న దురాలోచన తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వీరిలో ఏ మాత్రమైనా కనబడుతుందా?” అనే ఈ వాఖ్యం చూస్తే, అధికారం, ముఖ్యమంత్రి పదవి కోసం ఆనాడు జగన్ ఎంతగా తపించిపోయారో కళ్ళ ముందు మెదులుతుంది.
జగన్ సిఎం అయినప్పటి నుంచి ‘గిట్టని వారందరిపై కక్ష తీర్చుకోవాలనే ఆలోచన తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం చేసిందేమీ లేదని అందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడు అరెస్టు దీనికి తాజా నిదర్శనంగా కనిపిస్తూనే ఉంది. “చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడుతో సహా టిడిపి ముఖ్యనేతలందరిపై మళ్ళీ మళ్ళీ కేసులు వేస్తూనే ఉంటాము, అరెస్టులు చేస్తూనే ఉంటాము. జైలుకు పంపిస్తూనే ఉంటాము,” అని మంత్రి రోజా చెప్పడం గిట్టనివారిపై కక్ష సాధింపుకు మరో ఉదాహరణ. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినందుకు ఆమెతో సహా వైసీపి నేతలు స్వీట్లు పంచుకొని పండగ చేసుకోవడం వారి గిట్టనితనానికి మరో తాజా నిదర్శనం.
టిడిపి, జనసేన నేతలను, కార్యకర్తలనే కాదు.. వైసీపికి గిట్టని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు, రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్, ఐపీఎస్ అధికారి ఏబి. వెంకటేశ్వరరావు, తాజాగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ సలహాదారు పీవీ రమేష్ వంటి చాలామందిపై వైసీపి ప్రభుత్వం తన ప్రతాపం చూపడం అందరికీ తెలుసు.
కనుక మంత్రి బొత్స సత్యనారాయణ తమ పార్టీ ధోరణి గురించే ట్వీట్ ద్వారా చెప్పుకొన్నట్లనిపిస్తోంది. వేధింపుల గురించి వైసీపి నేతలు ఎంత తక్కువ మాట్లాడితే వారికే అంత మంచిది లేకుంటే తమని తామే నిందించుకొంటూ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టుకొన్నట్లవుతుంది.



