ఏపీ ఎన్నికలకు దేవుని బిడ్డలు కూడా సిద్ధం!

Brother-Anil-Vimala-Reddy

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు వైసీపి ‘సిద్దం’ అని జగన్మోహన్‌ రెడ్డి చెపుతున్నారు. మేము కూడా మిమ్మల్ని ఓడించేందుకు ‘సిద్ధం’ అంటూ టిడిపి, జనసేనలు చెపుతున్నాయి.

ADVERTISEMENT

పదేళ్లుగా రాష్ట్రంలో కనబడని కాంగ్రెస్ పార్టీ కూడా ‘సిద్ధం’ అని వైఎస్ షర్మిల చెపుతున్నారు. బీజేపీ కూడా ఢిల్లీలో ‘సిద్ధం’ అవుతోంది. ప్రజలు కూడా తేల్చిపడేయడానికి ‘సిద్ధం’గానే ఉన్నారు.

తాజాగా వైఎస్ షర్మిల భర్త అనిల్ కూడా బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో సమావేశం నిర్వహించి దేవుని బిడ్డలు అందరూ కూడా ‘సిద్దం’గా ఉండాలని చెప్పారు.

వైఎస్ షర్మిల భర్త రాష్ట్రంలో క్రీస్టియన్ ఓటు బ్యాంకుని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండటంతో, జగన్మోహన్‌ రెడ్డి కూడా తన మేనత్త వైఎస్ విమలారెడ్డిని రంగంలో దించారు. ఆమె నిన్న గన్నవరంలో పాస్టర్లతో ‘సేవకుల సమావేశం’ నిర్వహించారు.

దేవునినే నమ్ముకున్న జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించేందుకు అందరూ తలో చేయివేయాలని విజ్ఞప్తి చేశారు. కొందరు పాపులు కలిసి జగన్మోహన్‌ రెడ్డిని గద్దె దించేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారి నుంచి ఆయనను మనమే కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఫాదర్ బాలస్వామి తదితరులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కనుక ఈసారి ఎన్నికలలో కాపు సామాజిక వర్గంతో పాటు క్రీస్టియన్ ఓటర్లలో కూడా చీలికని సృష్టించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారన్న మాట! కానీ వారు చీలకపోవచ్చు. జగన్‌ వైపు మొగ్గు చూపవచ్చు.

ఎందుకంటే వైఎస్ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. పైగా ఆమె టిడిపి, జనసేనలకు సహకరించబోతున్నారని జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి నేతల ఆరోపణలు వారిని ఆలోచింపజేస్తున్నాయి. కనుక రాష్ట్రంలో క్రీస్టియన్ ఓటర్లు వైసీపివైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ టిడిపి, జనసేనలు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే క్రీస్టియన్ ఓటర్లందరూ మరో ఆలోచన చేయకుండా వైసీపికే ఓట్లు వేసి తమ బిడ్డని గెలిపించుకునే ప్రయత్నం చేయడం ఖాయమే.

చివరిగా ఒక మాట: టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకోవడం తప్పు, వైఎస్ షర్మిల ఏపీకి రావడం తప్పు. చంద్రబాబు నాయుడే ఆమెను రప్పించి కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఇటు కాంగ్రెస్‌తో రహస్య అవగాహన చేసుకుని, అటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ తనను గద్దె దించేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని జగన్మోహన్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. మరి ఆధ్యాత్మిక చింతనలో గడిపే విమలారెడ్డితో ఈవిదంగా రాజకీయాలు చేయించడాన్ని ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories