తెలంగాణ రాజకీయాలలో త్రిముఖ పోటీ ఉందంటూ బీజేపీ నేతలు అటు అధికార పక్షం కాంగ్రెస్ తోనూ, ఇటు ప్రతిపక్షం బిఆర్ఎస్ తోనూ రాజకీయ పోరాటాలకు చేస్తారు, అలాగే ఆయా పార్టీల నేతల మీద పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు గుప్పిస్తారు.
అయితే అటు అధికార కాంగ్రెస్ కానీ ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కానీ బీజేపీ రాజకీయ ఆటను అంత పెద్దగా పట్టించుకోకపోవడం కాసంత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. గతంలో కంటే బీజేపీ తెలంగాణలో దాని బలాన్ని పెంచుకున్న మాట, అలాగే పెంచుకోవాలనుకుంటున్న మాట కూడా ముమ్మాటికీ వాస్తవమే. ఆ దిశగా బీజేపీ ఒక్కో అడుగు వేసుకుంటూ పోతుంది.
2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకు గాను బీజేపీ 8 సీట్లను సొంతం చేసికోగలిగింది. అలాగే ఈ సమయంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కనీసం ఖాత తెరవలేకపోయింది. అలాగే తాజాగా జరిగిన తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అధికార కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చి 3 లో 2 స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ.
అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ తమ కుర్చీలాటలో బీజేపీ ని ఆటలో అరటిపండు మాదిరి లెక్కగడుతున్నారా అన్న సందేహం వస్తుంది. నిన్న జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలో మొత్తం లో ఎక్కడ బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు. అలాగే రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల మీద కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల మీద కానీ కేసీఆర్ ఎటువంటి విమర్శలు చెయ్యలేదు.
తెలంగాణలో తమ ప్రధమ రాజకీయ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పేరు ప్రకటించిన కేసీఆర్ బీజేపీ ఉసెత్తలేదు. గతంలో మోడీ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయం చేసిన కేసీఆర్ బీజేపీ మీద విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అంటే కేసీఆర్ కు తత్త్వం భోద పడిందా.? బిఆర్ఎస్ కు జ్ఞానోదయం అయ్యిందా.? లేక కేసీఆర్ బీజేపీ ని తమ రాజకీయ ప్రత్యర్థుల జాబితా నుంచి తొలగించారా.? అన్నది తేలాల్సి ఉంది.
కవిత అరెస్టు విషయంలో కానీ, బీజేపీ రాజకీయం మీద కానీ కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తో బిఆర్ఎస్, బీజేపీ లు తెరచాటు మిత్రులా అంటూ కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పై గట్టిగా ఎదురు దాడి చేస్తున్నారు. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ మీద వెళ్లినంత దూకుడుగా, బిఆర్ఎస్ పార్టీ మీద చేసినంత అలవుకగా బీజేపీ పై విమర్శనాస్త్రాలను సంధించదు.
అంటే కాంగ్రెస్ పార్టీ మెయిన్ టార్గెట్ కూడా బిఆర్ఎస్ పార్టీనే అనేది స్పష్టమవుతుంది. ఇలా ఈ రెండు పార్టీల రాజకీయ పోరులో బీజేపీ చాపకింద నీరులా తెలంగాణలో పాగ వెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా పొత్తులో భాగంగా పార్టీని బలోపేతం చెయ్యాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి బీజేపీ కమలం ఎవరి పొత్తు కోరుకుంటుందో చూడాలి.




