ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ అధ్వర్యంలో జరిగిన జనగర్జన బహిరంగసభకు ముఖ్య అతిధిగా హాజరైన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగి, కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన జాగీర్ అని, దానికి తాను రాజునని భావిస్తూ ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని పేదల భూములను, ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకొంటున్నారని ఆరోపించారు.
బిఆర్ఎస్ అంటే బిజెపి రిస్తేదార్ పార్టీ (బిజెపి బంధువుల పార్టీ) అని కొత్త అర్దం చెప్పారు. బిజెపికి బిఆర్ఎస్ ఖచ్చితంగా బీ-టీమేనని అందుకే కేసీఆర్ని అఖిలపక్ష సమావేశానికి రానీయలేదని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000 పింఛను ఇస్తామని, రాష్ట్రంలో పోడు భూములన్నీ అర్హులకు పంపిణీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక పార్టీని వీడి వెళ్ళిపోయిన వారందరూ తిరిగి రావాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తూనే ఉంది. లక్షల కోట్లు పెట్టుబడితో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. కనుక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనూహ్యంగా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు పధకాల పుణ్యమాని రైతుల పంటలు పండించుకొంటున్నారు.
ఏ రాష్ట్రంలోనైనా అప్రాధ్యాన్య రంగంగా భావించే పర్యాటకంతో సహా విద్యా, వైద్యం, విద్యుత్, రవాణా, మౌలికవసతులు అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధించింది.
అయితే ఈ అభివృద్ధి వెనుక భారీగా అవినీతి, అక్రమార్జన జరిగిందని, వాటితోనే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వేలు, లక్షల కోట్లు పోగేసుకొని, ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎదిగిపోయారని కాంగ్రెస్, బిజెపి, తదితర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది నిజమే అని ప్రజలు కూడా నమ్ముతున్నారు.
అయితే వారు కోరుకొంటున్న అభివృద్ధి చేసి వారికి కావలసింది కేసీఆర్ ఇస్తున్నందున తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకొంటారనుకోలేము. రాష్ట్ర విభజనకు మునుపు కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా ఉండేదో ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకొన్నారు. కనుక కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని తెలంగాణలో కూడా గెలిపిస్తారనుకోలేము.
అయితే కర్ణాటక విజయానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాగానే ‘హైప్’ సృష్టిస్తున్నారని చెప్పక తప్పదు. వారు ఈ హైప్ ఇలాగే ఎన్నికల వరకు కొనసాగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలను నమ్మించగలిగితే, కాంగ్రెస్ విజయావకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ అధికారంలోకి రాలేకపోవచ్చు.
ఇక రాహుల్ ఆరోపించిన్నట్లు, బిజెపి-బిఆర్ఎస్ మద్య ఏదో లోపాయికారి ఒప్పందం, బంధం ఉందనే అనిపిస్తుంది. తెలంగాణ బిజెపికి జీవం పోసి అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ని ఎన్నికలకు ముందు ఆ పదవిలో నుంచి తప్పించబోతుండటం, రాష్ట్ర బిజెపి నేతలు ఎంత మొత్తుకొంటున్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం ఇందుకు నిదర్శనాలుగా భావించవచ్చు. కనుక బిజెపి-బిఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకొంటున్నంత కాలం తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నటికీ అధికారంలోకి రాలేకపోవచ్చు. కనుక తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టుకొని ముందుకుసాగాల్సి ఉంటుంది.



