దక్షిణ భారతంలో పార్టీ పరంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వం పరంగా చాలా బలంగా ఉంది బీజేపీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బీజేపీ కి అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి వినతి పత్రాలు వెళ్లిన తరుణంలో ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రం నుండి బిఆర్ఎస్
పార్టీ తరుపున కేంద్ర పెద్దలకు మరో లెటర్ అందించడానికి కేసీఆర్ సిద్ధమయినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉంటారు అన్నట్లుగానే నిన్నటిదాకా నువ్వా – నేనా అన్నట్లు రాజకీయ వైరం చేసిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ పెద్దలతో దోస్తీకి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చలు జరపనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం ఊపందుకుంది.
అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని ఎదురుదెబ్బ తిన్న కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అదే దెబ్బ కాంగ్రెస్ పార్టీ కి ఇవ్వడానికి బీజేపీ సాయం కోరనున్నట్లు, అందుకోసమే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారంటూ కథనాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులలో లోపాలున్నాయి, ఇవి “తెలంగాణ ప్రజల నీటి దాహంగా కోసం కట్టిన ప్రాజెక్టులు కాదు కేసీఆర్ కుటుంబ ధనదాహానికి కట్టిన ప్రాజెక్టులు” అంటూ అసెంబ్లీ సాక్షిగా గత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న రేవంత్ రెడ్డిని తట్టుకోవడానికి కేసీఆర్ కు కేంద్ర సాయం తప్పనిసరి అయ్యింది.
దీనితో కేంద్ర ప్రభుత్వ సాయంతో రేవంత్ కు చెక్ చెప్పి తిరిగి తెలంగాణలో తన పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కేసీఆర్ ఢిల్లీ యాత్ర కు సిద్దమయ్యారా..? అనే అనుమనాలు బలపడ్డాయి. బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఎన్డీయే కూటమిలోకి వచ్చిన ఆహ్వానించేలానే ఉన్నటుంది. కాబట్టి కేసీఆర్ వ్యూహాలు ఫలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇంతకాలం కేసీఆర్ కు వ్యతిరేకంగా కాలుదువ్విన
బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ స్నేహ బంధాన్ని అంగీకరిస్తుందా అంటే అది సందేహమే.
ముఖ్యంగా ఈటెల వంటి ముఖ్య నేతలు కేసీఆర్ తో విభేదించి బీజేపీ కండువా కప్పుకున్నారు, ఇటువంటి నేతలు కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి ఏమాత్రం అంగీకరించారు. ఒకవేళ ఏపీలో జగన్ మాదిరి అధికారిక పొత్తు కాకుండా అనధికార మద్దతు కోరుకుంటే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇలా రాష్ట్ర స్టాయి ప్రాంతీయ పార్టీలు తమ అవసరానికో, తమ ఎదుగుదలకో జాతీయ పార్టీలతో రాజకీయాలు చేయక తప్పనిసరయ్యాయి.




