బిఆర్ఎస్ పొలంలో మొలకలొచ్చాయి..మరి వైసీపీ.?

BRS Eyes Bypolls as YSRCP Struggles

రాష్ట్రంలో ప్రస్తుతం తమ బలమెంత.? ప్రజలలో మన పార్టీ పరిస్థితి ఏంటి.? ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా ఎంత మేరకు మలచుకోగలిగాము.? అన్న అనేక ప్రశ్నలకు నేడు తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ దగ్గర సమాధానంగా ‘ఉపఎన్నికలు’ అనే ఆశా జ్యోతి కనిపిస్తుంది.

కానీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి ఆ ఆశా కిరణం కనుచూపు మేరలో కూడా కానరావడం లేదు. తెలంగాణలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ పార్టీ తాజా పరిస్థితికి అద్దం పట్టనుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై సకాలంలో రైతు బంధు రాక, సాగు నీరు లేక రైతులు ఆక్రోశంతో ఉన్నారు,

ADVERTISEMENT

హైడ్రా తో రేవంత్ బుల్డోజర్ల పాలన చేస్తూ సామాన్యుడి సొంత ఇంటి కలను చెరిపేస్తున్నారు, బనకచర్ల తో ఏపీకి అనుకూలంగా రేవంత్ పని చేస్తున్నారు, హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళుతోంది, బీసీ రిజర్వేషన్ తో రేవంత్ రాజకీయాలు చేస్తున్నారు అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ముప్పేట దాడి చేస్తుంది.

అలాగే ఇటు రేవంత్ సర్కార్ కూడా కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి, మేడిగడ్డలో హరీష్ అక్రమాలు, ఈ ఫార్ములా రేసింగ్ లో క్విట్ ప్రోకోలు, ఫోన్ టాపింగ్ తో కేటీఆర్ అరాచకాలు అంటూ కేసీఆర్ నుంచి హరీష్, కేటీఆర్ వరకు అందరి మీద గత పదేళ్ల అవినీతి చిట్టా పద్దులు అంటూ ఒక్కో అంశాన్ని బయటకు తీస్తున్నారు.

ఇలా తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు ఒకరికొకరు తగ్గేదెలా అన్నట్టుగా ఎవరి వాదనలు వారు వినిపిస్తూ రానున్న ఉపఎన్నికలలో తమ పార్టీ సత్తా చూపించాలని తద్వారా ప్రత్యర్థి బలాన్ని దెబ్బ కొట్టాలని భావిస్తున్నాయి. ఇక దీనికి తోడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల విషయంలో కూడా న్యాయస్థానాలు బిఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పుని ప్రకటించడం తో బిఆర్ఎస్ ఆశలు ఇప్పుడు పదింతలయ్యాయి.

దీనితో బిఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రంలో ఉప ఎన్నికల కోసం ఆశగా ఎదురు చూస్తూ తన కారు జోరు చూపించాలని ఉర్రుతలాడుతుంది. ఇక ఏపీలో వైసీపీ విషయానికొస్తే గత ఐదేళ్ల పొరపాట్లను అలవాట్లుగా మార్చుకుని రప్ప రప్ప కు సిద్ధమా.? ఆడవారిని అవమానించడం మీ నైజమా.? అంటూ పార్టీ శ్రేణులను రెచ్చకొట్టే రాజకీయం తో ప్రోత్సహిస్తుంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏపీలో ఏ రూపంలోనూ ఇప్పట్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పరామర్శల పర్యటనలతో, ఓదార్పు యాత్రలతో వైసీపీ చేస్తున్న బలప్రదర్శన క్షేత్ర స్థాయిలో అంతే బలంగా ఉందా.? లేదా ఇదంతా వాపేనా.? అన్న అనేక ప్రశ్నలకు వైసీపీ దగ్గర సరైన జవాబు లేదు.

బిఆర్ఎస్ ముందు ఉప ఎన్నిక అనే స్పష్టమైన గమ్యం కనిపిస్తుంది. అందుచేత అవకాశాన్ని బట్టి గులాబీ కారు GPS ఆన్ చేసుకుని సురక్షితంగా తన గమ్యస్థానాని చేరుకోగలదు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ అసెంబ్లీ కి వెళ్ళాక, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనీయక రెచ్చకొట్టే రాజకీయాలు చేస్తూ దారి తప్పి రోడ్డున పడింది.

దీనితో బిఆర్ఎస్ పొలంలో ఉపఎన్నికలు అనే మొలకలొచ్చి పార్టీ ముందుకు నడుస్తుంటే, వైసీపీ మాత్రం గాలికి తెగిపడిన గాలిపటం మాదిరి, దారి తప్పిన బాటసారి లెక్క గమ్యం లేని ప్రయాణం, దిక్కు తోచని రాజకీయం చేస్తూ కళ్ళు మూసుకుని కాలం వెళ్లదీయాలని చూస్తుంది.

ADVERTISEMENT
Latest Stories