ఏపీలో వైసీపి, తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి ఇంచుమించు ఒకేవిదంగా ఉందిప్పుడు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చేసుకొంటూ స్వయంగా తన పార్టీలో చిచ్చు రాజేసుకుంటున్నారు.
ఇక తెలంగాణ ఎన్నికలలో ఓటమి తర్వాత బిఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల రూపంలో మరో అగ్నిపరీక్ష ఎదుర్కోవలసి వస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాలలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నాయి. మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి ఉండేదని కేటీఆర్ అన్నారు. అంటే ఆయన కూడా జగన్లాగే తన ఎమ్మెల్యేనే నిందిస్తున్నారన్న మాట! జగన్ ఎన్నికలకు ముందే వారిపై ‘అసమర్ధులు’ అనే ముద్రలు వేసి పక్కన పెట్టేస్తుంటే, కేటీఆర్ ఓటమి తర్వాత ‘అసమర్దులు’ అని నిందిస్తున్నారు. అంతే తేడా!
శాసనసభ ఎన్నికలలో జరిగిన ఈ తప్పులను పునరావృతం కానీయమని కేటీఆర్ చెప్పారు. అంటే సిట్టింగ్ ఎంపీలు అందరికీ మళ్ళీ సీట్లు ఇవ్వబోమని చెప్పిన్నట్లే కదా దానర్దం? అంటే ఇక్కడ జగన్ ఏమి చెపుతున్నారో అక్కడ కేటీఆర్ కూడా అదే చెపుతున్నారన్న మాట! అందుకు తగ్గట్లే ఈసారి కేసీఆర్, కేటీఆర్ లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తారంటూ మీడియాకి లీకులు వచ్చాయి.
బిఆర్ఎస్ పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి వైసీపిలో చిచ్చుపెట్టుకొంటుంటే, తమ పార్టీ ఓటమికి కేసీఆర్ అహంభావం, నిరంకుశపోకడలు, అవినీతే కారణాలని తెలిసి ఉన్నా కేటీఆర్ తన ఎమ్మెల్యేలను తప్పు పడుతూ, లోక్సభ ఎన్నికలలో ప్రయోగాలు చేయడానికి సిద్దపడుతున్నారు.
కనుక అక్కడ బిఆర్ఎస్, ఇక్కడ వైసీపి పరిస్థితి ‘సేమ్ టూ సేమ్’గానే కనిపిస్తోంది. కనుక ఎన్నికలలో ఫలితాలు కూడా‘సేమ్ టూ సేమ్’గానే ఉంటాయేమో?




