అమరావతి ఇష్యూ కోర్టులో ఉందని… కేసులను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు. కోర్టు నుంచి అనుమతి రాగానే కర్నూలులోని జగన్నాథగుట్ట వద్ద హైకోర్టు నిర్మాణం ప్రారంభమవుతుందనీ మునిసిపల్ ఎన్నికల పోలింగ్కి ముందు రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి గారు సెలవిచ్చారు.
ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం మొత్తం కాన్సంట్రేషన్ విశాఖ మీదే పెట్టింది. పైకి మూడు రాజధానులు అన్నా లోపల మాత్రం దృష్టాంతా విశాఖ మీదే. దీని మీద ఇప్పటికే కర్నూల్ ప్రజలకు ఒక అభిప్రాయం రావడంతో ఎన్నికల వేళ మంత్రి గారు కొత్త నాటకానికి తెరలేపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకా అన్నట్టు 250 ఎకరాల నాటకం తెరమీదకు తెచ్చారు.
కోర్టు కేసులు పరిష్కారమైనా కర్నూల్ న్యాయ రాజధాని కావడానికి అడ్డంకులు తొలగిపోవు. హై కోర్టు ఇప్పటికే అమరావతిలో ఉండాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ఆమోదం పొందింది. మిగిలినవి ప్రభుత్వం తరలించేసుకునే అవకాశం ఉన్నా హై కోర్టుకు మాత్రం అంత తేలిక కాదు.
రాజకీయ లబ్ది కోసం మూడు కాదు ముప్పై రాజధానులు అనొచ్చు. అయితే హైకోర్టు అమరావతిలో పెట్టేశాకా అక్కడి నుండి మార్చాలంటే సుప్రీం కోర్టును సహేతుకమైన కారణాలు చెప్పి ఒప్పించాలి. బుగ్గన గారు మీడియా ముందుకు వచ్చి చెప్పేసినంత తేలిక అయితే కాదు.





