‘రాజకీయాలు నా వల్ల కాదు మహాప్రభో…’ అంటూ మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకుని వెండితెరపై రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి, అందుకు అనుగుణంగా ఎప్పుడూ లేని విధంగా బహిరంగంగా పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుకుంటున్నారు. అయితే ఈ వేడుకపై ఒకప్పటి ‘ప్రజారాజ్యం,’ ప్రస్తుత కాంగ్రెస్ నేత అయినటువంటి సి.రామచంద్రయ్య పలికిన పలుకులు అభిమానుల చేత నవ్వులు పూయించాయి.
బహుశా అభిమానులను మరింత ఉద్వేగపరచాలని చేసిన ప్రయత్నమో లేక చిరు రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఆశలు పెంచుకున్నారేమో గానీ, రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు మరీ కామెడీగా మారిపోవడం విశేషం. ‘సమాజంలో మార్పు తెచ్చే వ్యక్తిగా, సంఘానికి ఏదో చేయాలనే తపన పడే మనిషిగా’ రాజకీయ కోణంలో చిరంజీవిని కొనియాడుతుంటే… ఆడిటోరియంలో ఉన్న అభిమానుల నుండి కనీసం చప్పట్లు కూడా లేకపోవడం… వారి యొక్క ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇలా పొలిటికల్ యాంగిల్ కంటే కూడా… బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు వంటి తదితర అంశాలను ప్రస్తావించి మెగాస్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటే… ఫ్యాన్స్ మరింత సంతోషపడేవారేమో!
మిక్కిలి ఆసక్తికర వ్యాఖ్యలు ఏమిటంటే… రాజకీయ ప్రక్షాళన చిరంజీవి చేయాలంట! బహుశా ఈ మాటలు అభిమానులకు కూడా రుచించవేమోనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘మార్పు’ కోసం అని పెట్టిన ‘ప్రజారాజ్యం’కు అసలు ఉద్దేశం ఏమిటో… ‘విలీనం’ ద్వారా చెప్పకనే చెప్పి తన అభిమతాన్ని మెగాస్టార్ గారు గర్వంగా చాటుకున్న వైనం… బహుశా అభిమానులకు ఇప్పటికీ జీర్ణం కాని అంశం అని చెప్పవచ్చు. మళ్ళీ కొత్తగా రామచంద్రయ్య చిరంజీవిని రాజకీయ కోణంలో ప్రశంసలు కురిపిస్తుంటే… ‘హాస్యం… హాస్యం…’ అనుకోవడం వీక్షకుల వంతయ్యింది.
మెగా అభిమానులంతా “ఖైదీ నంబర్ 150”వ సినిమా మూడ్ లో ఉంటే… చిరుపై తన ప్రేమను చాటుకోవడానికి రామచంద్రయ్య చేసిన అతిశయోక్తులను చూసి తలలు పట్టుకోవడం అభిమానుల వంతయ్యింది. అయితే పేలవంగా సాగుతున్న ఈ ‘మెగా’ ఈవెంట్ లో కొంత హాస్యం పండించడంలో మాత్రం సి.రామచంద్రయ్య పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు.



