కొన్ని ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానం చెప్పలేం. కోడి ముందా గుడ్డు ముందా లాంటివి ఈ కోవలోకే వస్తాయి. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంది. ముఖ్యంగా రాజకీయాలు, సినిమాలు త్వరగా దాని ఉచ్చులో పడుతున్నాయి. ట్విట్టర్ లో మేం ఫేమస్ మీద జరుగుతున్న రచ్చ పట్ల నిర్మాతలు స్పందించాల్సి వచ్చింది. నిజానికి డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమాకి కలెక్షన్లు భీభత్సంగా లేవు కానీ వెళ్లిన యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా అని ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డులేమీ లేవు. హైదరాబాద్ లాంటి చోట్ల వైబ్ బాగానే ఉంది. మరి సమస్య ఎక్కడ వచ్చింది.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా రెండు రకాల అభిప్రాయాలు ఏర్పడటం సహజం. ఇందులో మెజారిటీ శాతం ఏది సాధిస్తుందో దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు జాతిరత్నాలుకు వచ్చిన టాక్ ముప్పై కోట్లను దాటించేలా చేసింది. అయిదు కోట్లు వస్తే చాలనుకున్న రైటర్ పద్మభూషణ్ పది దాకా వెళ్ళింది. రివ్యూలు మెచ్చుకున్నా విమర్శించినా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా అవి విజయం సాధించాయి. కానీ మేం ఫేమస్ విషయంలో మహేష్ బాబు ట్వీట్ తో మొదలైన రగడ తర్వాత చల్లారినా కంటెంట్ మీద డిస్కషన్ మాత్రం జరుగుతూనే ఉంది.
ఒకవేళ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఈ టాపిక్ అక్కర్లేదు. కానీ బాగుందన్న వాళ్ళతో సమానంగా బాలేదన్న వాళ్ళు ఉన్నారు.
ట్విట్టర్ లో కొందరు ఉద్దేశపూర్వకంగా నెగటివిటీని ప్రచారం చేయడం వల్లే ఇలా జరుగుతోందని టీమ్ భావిస్తోంది. ది కాశ్మీర్ ఫైల్స్ ని ప్రాపగాండా అన్నప్పుడు, కేరళ స్టోరీలో ఏమీ లేదని తేల్చినప్పుడు, పఠాన్ ను బ్యాన్ చేయాలని పిలుపు ఇచ్చినప్పుడు ఈ సోషల్ మీడియా పిలుపులేవి పబ్లిక్ ని థియేటర్లకు వెళ్లకుండా ఆపలేకపోయాయి. ఆడియన్స్ ఏవి చూడాలో చూడకూడదో పూర్తి విచక్షణతో ఉంటున్నారు. కేవలం ట్వీట్లకు ఆగిపోయేంత వీక్ గా లేరు.
తప్పుడు ఉద్దేశాలు ఆపాదించే వాళ్ళు అన్నిటిలోనూ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమా నచ్చిందని ట్వీట్ చేశారు కాబట్టి ఆయన్ను అర్థమో అపార్థమో చేసుకునే జనాలను ఎలా ఆపగలరు. ఇదో నిత్య ప్రవాహం.
దూకాక ఈదుకుంటూ బయటికి వచ్చే ప్రయత్నం చేయాలి తప్పించి ఎవరు తోశారని ఎంక్వయిరీ చేస్తూ నీళ్లలోనే అలిగి కూర్చుంటే లాభం లేదు. అంతిమ తీర్పు ఇచ్చేది ప్రేక్షక దేవుళ్ళే. వాళ్లంతా ట్విట్టర్ లోనే ఉంటారనుకోవడంలో లాజిక్ లేదు.



