అరే! ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఈ కేసు గుర్తురాలేదే!

Kotamreddy_Sridhar_Reddy_Vs_YSRCP
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడుతున్నప్పుడే చెప్పారు… ఇక నుంచి తనకీ ప్రతిపక్ష నేతల్లాగ వేధింపులు, పోలీసు కేసులు మొదలైపోతాయని! వాటికి సిద్దపడే తాను వైసీపీని వీడానని లేకుంటే మిగిలినవారిలా చివరి నిమిషం వరకు పార్టీని అంటిపెట్టుకొని ఉండి ఎన్నికలకి ముందు పార్టీని వీడి ఉండేవాడినని చెప్పారు.

వైసీపీలో ఉన్నంతకాలం ఆయన చాలా మంచి ఎమ్మెల్యే అని, పార్టీ, ప్రభుత్వం, నియోజకవర్గంలో ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశంశించేవారు. కానీ పార్టీ వీడగానే వైసీపీ ఆయనని ఓ దుష్టుడు, దుర్మార్గుడుగా అభివర్ణిస్తోంది. ఆయన ముందే చెప్పిన్నట్లుగానే 2022 అక్టోబర్‌లో ఆయనపై నమోదైన ఓ పోలీసు కేసు ఇప్పుడు యాక్టివ్ అయ్యింది కూడా!

ADVERTISEMENT

టిడిపి నేత మాతంగి కృష్ణపై హత్యాయత్నం కేసు అది. దానిలో ఆయనతో సహా అనుచరుల పేర్లు కూడా ఉన్నాయి. విశేషమేమిటంటే, కోటంరెడ్డి వైసీపీలో ఉన్నంతకాలం ఆ కేసు ఊసే లేదు. ఇప్పుడు పోలీసులు బయటకి తీశారు. ఆయనతో పాటు బయటకి వెళ్ళిన అనుచరులు కూడా ఇప్పుడు ఈ కేసులో ఇరుకొన్నారు.

అంటే ఎన్ని నేరాలు చేసినా అధికార పార్టీలో ఉంటే కేసులు ఉండవు. ఉన్నా అవి అటక మీదనే ఉండిపోతాయన్న మాట! కానీ పార్టీని వీడితే అవన్నీ అటక మీద నుంచి దింపి మెడకి తగిలిస్తారన్న మాట! ఈ వెసులుబాటు, తర్వాత ఇటువంటి ఇబ్బందీ ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రమే కాదు… వైసీపీలో ఉన్న తామందరికీ కూడా వర్తిస్తుందని మిగిలినవారు గుర్తించే ఉంటారు. కనుక పులిమీద సవారీ చేస్తున్న వైసీపీ నేతలందరూ ఎన్నికల గంట మ్రోగేవరకు ఆ పులి మీద నుంచి కిందకు దిగే ప్రయత్నం చేయకపోవచ్చు. చేస్తే ఏమవుతుందో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చూస్తే అర్దమవుతోంది కదా?

ఈ కేసుపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులో అసలు తన పేరే లేదని కానీ ఇప్పుడు చేర్చారని, వైసీపీ నుంచి బయటకి వచ్చేసినందునే ప్రభుత్వం తనపై ఈవిదంగా తప్పుడు కేసులు పెట్టించిందని కనుక ఈ కేసు నుంచి తనకి విముక్తి కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకి నోటీస్ పంపించి ఈ కేసు తదుపరి విచారణని రెండు వారాలకి వాయిదా వేసింది.

ఈవిదంగా తన వర్గంపై ఒత్తిడి పెంచడం ద్వారా వారిని తిరిగి వైసీపీలోకి రప్పించుకోవాలని ప్రయత్నిస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఇటువంటి కేసులు, బెరింపులకి తాను, తన అనుచరులు ఎవరూ భయపడబోమని చెప్పారు. త్వరలోనే ప్రజా ఆశీర్వాదయాత్ర పేరుతో తన నియోజకవర్గంలో పాదయాత్రతో ప్రజల మద్యకి వెళతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

మరోపక్క ఆయన బయటకి వెళ్ళగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించడంతో ఆయన కూడా అందరినీ తనవైపు తిప్పుకొని నియోజకవర్గంపై పట్టు పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనని కూడా నిలువరించుకొంటూ తన వర్గాన్ని చేజారిపోకుండా కాపాడుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories