రాజకీయాల్లో ఓటమి తర్వాత ఆత్మపరిశీలన చేసుకోవడం, తప్పులు అంగీకరించి సరిదిద్దుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక తమ ఓటమికి ఎదుట వాళ్ళన్ని నిందిస్తుంటారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోయినప్పుడు ఇలాగే ఇతరులను నిందించాయి.
కానీ అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ళ తర్వాత మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ తాజా ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వ హయాంలో అనేక తప్పులు జరిగాయని బహిరంగంగా అంగీకరించారు. “మేమేమీ దేవుళ్ళం కాదు. మేము కూడా మనుషులమే. అందుకే తప్పులు చేశాం” అని కేటీఆర్ చెప్పడం రాజకీయ పరిపక్వతే. బీఆర్ఎస్ హయంలో జరిగిన తప్పుల జాబితాలో ఆయన ‘గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం’ గురించి చెపుతూ “అప్పుడే వెంటనే టిపీఎస్సీసీని రద్దు చేసి ఉండాల్సింది. కానీ ఆ దరిద్రాన్ని మా నెత్తిన పెట్టుకొని మోశాము,” అని అన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టిపీఎస్సీసీని రద్దు చేసి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా చాలా పకడ్బందీగా గ్రూప్ పరీక్షలు నిర్వహించింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుని కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దిందన్న మాట!
తమ హయంలో జరిగిన తప్పులను మానవ సహజంగా సమర్థించుకున్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, సిఎం రేవంత్ రెడ్డి నిత్యం దేనికో దానికి విమర్శిస్తూనే ఉంటారు. అంటే బీఆర్ఎస్ తప్పులు చేయవచ్చు చేసినా సహజంగా పరిగణించాలి. కానీ ఇతర పార్టీలు, వ్యక్తులు చేస్తే మాత్రం క్షమించరాని నేరాలన్నట్లు కేటీఆర్ మాట్లాడటం ద్వంద వైఖరికి నిదర్శనం కాదా?
తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో తాము విఫలమయ్యామని కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం తాము చేస్తున్న మంచిపనులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలను ప్రజలకు చెప్పుకుంటుంటే, కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరూ కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేసినట్లు తప్పు పడుతుంటారు.
బీఆర్ఎస్ బాటలోనే సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా నిత్యం ఇతరులను విమర్శిస్తూనే ఉంటారు. తప్పులు పడుతూనే ఉంటారు. రాజకీయాలలో ఇది సాధారణమే కావచ్చు. కానీ రాజకీయాలలో నైతిక విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు ముందుగా వారు వాటిని పాటించాలి కదా?




