అక్రమాస్తుల కేసులో ఏ-1 ముద్దాయిగా బెయిల్ పై బయట ఉన్న వైఎస్ జగన్, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కనుక జగన్ బెయిల్ ను వెంటనే రద్దు చేయాలంటూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అప్పటివరకు సైలెంట్ వా ఉన్న వాతావరణం కాస్త సమ్మర్ సెగను తలపించింది. దీనికి అనుబంధంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను సీబీఐ కోర్టుకు జత చేసింది.
శుక్రవారం నాడు ఈ కేసు విచారణకు రాగా, జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసారు. సదరు ఇంటర్వ్యూలో రమాకాంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ అధికారులతో జరిపిన సంభాషణలను మాత్రమే తెలిపారని, అందులోనూ విలేఖరి అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబిచ్చారని ఈ కౌంటర్ పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు. సదరు అంశాలను తెలుపుతూ, తన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్ ను కొట్టివేయాల్సిందిగా జగన్ కోర్టును అభ్యర్ధించారు.
వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మరో రెండు వారాల వరకు జగన్ బెయిల్ కు వచ్చిన ఇబ్బందులేవీ లేవు. తమ పార్టీ అధినేత బెయిల్ ఏమవుతుందోనని ఉత్కంఠతో ఎదురుచూసిన వైసీపీ వర్గాలకు ప్రస్తుతానికి ఊరట లభించింది. అయితే పిటిషన్ ద్వారా జగన్ చేసిన అభ్యర్ధనను కోర్టు పరిశీలనలోకి తీసుకుంటుందా? అదే జరిగితే జగన్ ఆశ నెరవేరుతుందా? లేక తదుపరి విచారణలో సంచలన తీర్పు బయటకు వస్తుందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి



