మహారాష్ట్ర కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పలు సంచలన కేసులను ఛేదించిన లక్ష్మీనారాయణ… నవ్యాంధ్ర నూతన రాజధాని ‘అమరావతి’కి పోలీస్ కమిషనర్ గా రానున్నారా? అంటే… అవుననే అంటున్నాయి పలు మీడియా సంస్థలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన లక్ష్మీనారాయణ… కేసులో పలు కీలక ఆధారాలను సేకరించి జగన్ ను ఏకంగా అరెస్ట్ చేసి సంచలనాత్మకమయ్యాయి.
అలాగే, ఓబుళాపురం అక్రమ గనులకు సంబంధించిన కేసును కూడా లక్ష్మీనారాయణే చేపట్టారు. ఈ కేసులోనూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కటకటాల వెనక్కి నెట్టి ‘శభాష్’ అనిపించుకున్నారు. ఈ రెండు కేసుల దర్యాప్తులో మెరుగైన పనితీరు కనబరచిన లక్ష్మీనారాయణ సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ తన సొంత కేడర్ అయిన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో అదనపు డీజీ హోదాలో పనిచేస్తున్నారు.
అయితే ఏపీలో టీడీపీ అదికారంలోకి రావడం, నవ్యాంధ్ర నూతన రాజధాని కేంద్రంగా కొత్త కమిషనరేట్ ను ప్రారంభిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో… ఒక్కసారిగా లక్ష్మీనారాయణ పేరు తెర పైకి వచ్చింది. అమరావతి కమిషనర్ గా లక్ష్మీనారాయణ వస్తున్నారని ఎలా మొదలైందో గానీ, ఏపీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ప్రచారంపై లక్ష్మీనారాయణ స్వయంగా ఓ మీడియా ఛానల్ లో స్పష్టం చేసారు.
“తాను అమరావతి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపడుతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, అదంతా తప్పుడు ప్రచారమేనని, ఈ దిశగా తానేమీ ప్రయత్నాలు చేయలేదని, ఒకవేళ ఆ ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినా అంగీకరించబోనని” ఓ స్పష్టమైన ప్రకటన చేసారు. ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులో ఉన్న తాను అంతకంటే తక్కువ స్థాయి ర్యాంకు ఉన్న అధికారి చేపట్టాల్సిన అమరావతి పోలీస్ కమిషనర్ పదవిని తానూ చేపట్టబోనని లక్ష్మీనారాయణ వివరణ ఇచ్చుకున్నారు. దీంతో లక్ష్మీనారాయణ ఉదంతంపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లయ్యింది.



