శాసనసభ ఎన్నికల వరకు తెలంగాణలో కేసీఆర్కి, బిఆర్ఎస్ పార్టీకి తిరుగేలేదన్నట్లు సాగేది. మరోసారి మాత్రమే కాదు…మరో మూడు నాలుగుసార్లు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందనే ధీమా అందరిలో కనపడేది.
ప్రతిపక్షాలు ఎంత అరిచి గీపెట్టినా తెలంగాణలో కేసీఆర్ని కొట్టే మొగాడే లేడని ప్రజలు కూడా భావించేవారు. అటువంటి కేసీఆర్ని, బిఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి చావు దెబ్బతీసారు. బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ లేవకుండా చేసేందుకు అనేక కేసులు కూడా సిద్దం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చాలా తక్కువగా అంచనా వేసి ఎదురుదెబ్బ తిన్న కేసీఆర్ మళ్ళీ బీజేపీతో పొత్తుకి సిద్దమని ఢిల్లీ పెద్దలకి సిగ్నల్స్ పంపిస్తుంటే, వారు కూడా పట్టించుకోవడం లేదు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఫైల్స్ ని తలకింద పెట్టుకొని నిద్రపోతున్న సీబీఐని కూడా నిద్రలేపి ‘చొక్కా మడత’ పెట్టమన్నారు.
దాంతో సీబీఐ కూడా కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ‘లిక్కర్ స్కామ్’ కేసులో విచారణకు ఈ నెల 26న ఢిల్లీలో తమ కార్యాలయంలో హాజరుకావాలని నోటీస్ పంపించింది.
అయితే వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని, ఈ కేసులో కల్వకుంట్ల కవితని విచారణకు రప్పించలేకపోతున్న ఈడీని, వారిరువురే సుప్రీంకోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తుంటే, సీబీఐ నోటీస్ ఇవ్వగానే కల్వకుంట్ల కవిత ఢిల్లీలో వాలిపోతారనుకోవడం రాజకీయ అవివేకమే అవుతుంది.
అయితే ఈ కేసు విచారణకు కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణకు హారవుతారా లేదా?అనేది ముఖ్యం కాదు. ఈడీ పరిస్థితిని కళ్ళారా చూస్తూ కూడా సీబీఐ కల్వకుంట్ల కవితకు ఎందుకు నోటీస్ పంపింది?అనేదే ముఖ్యం.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్కు తెలంగాణలో పెద్దగా పనిలేదు కనుక మళ్ళీ జాతీయ రాజకీయాలంటూ రెచ్చిపోకుండా నియంత్రించకపోతే, ఆయన మహారాష్ట్రలో హడావుడి చేస్తే బీజేపీకి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది.
కనుక గత ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ని అటువైపు వెళ్ళనీయకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కట్టడి చేసినట్లే, ఇప్పుడూ అదే కేసుతో అదే విదంగా కేసీఆర్ని కట్టడి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం సీబీఐని నిద్ర లేపి ఉండవచ్చు. కనుక లోక్సభ ఎన్నికలు పూర్తవగానే మోడీ, అమిత్ షాలు ‘డిస్టర్బ్’ చేయకపోతే ఈడీ, సీబీఐలు మళ్ళీ కుంభకర్ణ నిద్రలోకి జారుకోవచ్చు.




