స్కిల్ కేసులో అరెస్టయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు పట్ల రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన సింపతీ, బాబుకి ప్రజలలో దక్కిన మద్దతు చూసిన రెండు రాష్ట్ర రాజకీయ పార్టీలు అన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలలో టీడీపీ పార్టీ ప్రస్తుతానికి పోటీ చేయనప్పటికీ చంద్రబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
అటు అధికార బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సైతం బాబు అరెస్టు అక్రమమని జగన్ తీసుకున్న నిర్ణయం అన్యాయమని బాబుకి మద్దతుగా,జగన్ కు వ్యతిరేకంగా తమ ఎన్నిక ప్రసంగాలలో ప్రకటనలు చేశారు.అలాగే కాంగ్రెస్, బీజేపీ, జనసేన కూడా బాబు పట్ల జగన్ వైఖరిని తప్పుపడుతూ ప్రకటనలు చేసి టీడీపీ ఓటుబ్యాంకును తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
డిసెంబర్ మూడు తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలలో బాబు పోషించిన పాత్రేమిటో ఇటు తెలంగాణ రాజకీయ పార్టీలకు, అటు ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకి కూడా అర్ధమవుతుంది. అయితే ఏపీలో 2019 ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ చంద్రబాబుకి వ్యతిరేకంగా వ్యూహాలు వేసి ఏపీలో జగన్ గెలుపుకి సహకరించిన కేసీఆర్ సైతం తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అదే జగన్ పాలనను విమర్శిస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడం వైసీపీ అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది.
డబుల్ రోడ్.., సింగల్ రోడ్…, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కూడా అమరావతి లెక్క మారుతుందంటూ జగన్ పాలనా విధానాలను విమర్శించిన బిఆర్ఎస్
పెద్దలు 2023 ఎన్నికల ఫలితాల తరువాత తిరిగి అధికారం చేపడితే తమ పాత మిత్రుడైన జగన్ కే తమ మద్దతు తెలుపుతారా? లేదా అనేది వేచి చూడాలి.తన రాజకీయ అవసరాలకు ఎవరినైనా నెత్తినపెట్టుకోనూగలరు, అలాగే ఎవరినైనేనా పాదాల కింద అణచిపెట్టనూగలరు కేసీఆర్ అనేది ఎన్నో సందర్భాలలో రుజువుచేసుకున్నారు కూడా.






