ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును విభజించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజనకు కేంద్ర న్యాయశాఖ అంగీకరించింది. త్వరలోనే దీనికి సంబంధించి రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజైన జూన్ రెండో తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల క్రితమే హైకోర్టు విభజన కోసం కేంద్రానికి లేఖ రాశారు. రెండు రోజుల క్రితం ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా చర్చించారు. హైకోర్టు విభజనకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు సభలో ప్రకటించింది. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
అయితే, హైకోర్టు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని… సుప్రీంకోర్టు కొలీజియం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జడ్జీల విభజన అంశాన్ని హైకోర్టు కొలీజియం పరిశీలిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం హైకోర్టును విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.



