ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటనేది ఇటీవల ఓ మీడియా సంస్థ తన ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే సదరు మీడియా సంస్థపై విశ్వసనీయత కారణంగా సదరు సర్వేపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీగా చంద్రబాబు, ప్రత్యర్ధి పార్టీల బలాబలాలను ఖచ్చితంగా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఎన్నికలలో బొక్కా బోర్లా పడడం ఖాయం. తాజాగా టిడిపి అధినేత కూడా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ప్రభావం ప్రజల్లో పెద్దగా లేదని భావిస్తున్న చంద్రబాబు, ‘జనసేన’ అధినేత గురించి ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి సన్నాహాలు జరిగినట్లుగా టాక్. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలలో వివిధ విభాగాలకు చెందిన 100 మంది అభిప్రాయాలను సేకరించాలని ఈ సర్వే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేసారు? వచ్చే ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు? వంటి ప్రశ్నలతో పాటు… ‘జనసేన’పై పలు కీలక ప్రశ్నలు ఈ సర్వేలో ఉన్నట్లుగా సమాచారం.
పవన్ సమర్ధవంతమైన రాజకీయ నాయకుడేనా? జనసేన సింగిల్ గా బరిలోకి దిగితే మద్దతు తెలుపుతారా? జనసేన పూర్తి స్థాయిలో పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టమని భావిస్తున్నారు? వంటి తదితర ప్రశ్నలతో ఏపీ ఇంటిలిజెన్స్ విభాగం ఈ సర్వేను నిర్వహిస్తోందని, దీని తర్వాత ‘జనసేన’ అధినేతపై ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వస్తారని, దానికి అనుగుణంగా భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయని పొలిటికల్ వర్గాల ఇన్ఫర్మేషన్.



