ఎవరు ఔనన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు కృషితోనే ఇదివరకు హైదరాబాద్లో, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు వచ్చాయని అందరికీ తెలుసు. వాటిని రప్పించేందుకు ఆయన స్వయంగా కృషి చేయడమే కాకుండా వాటికి అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తూ, అవి ప్రశాంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు తగిన వాతావరణం కూడా కల్పించారు. తమ ప్రభుత్వం పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలకు పెద్ద పీటవేస్తుందని వాటికి అండగా నిలబడుతుందనే నమ్మకం, భరోసా కూడా కల్పించారు.
సినీ పరిశ్రమలో చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తదితరులకు ఎలాంటి స్టార్ ఇమేజ్ ఉందో ఐటి, పారిశ్రామిక రంగాలలో చంద్రబాబు నాయుడుకు కూడా అటువంటి గొప్ప బ్రాండ్ ఇమేజ్ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడుని చూసి అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తుండేవి.
అయితే జగన్ ప్రభుత్వ ఆలోచనలు, ప్రాధాన్యత అన్నీ పారిశ్రామిక అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నందున రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయాయి. కొత్తగా రావడం లేదు కూడా.
ఈ నేపధ్యంలో టిడిపి యువనేత నారా లోకేష్ నిన్న మంగళగిరి నియోజకవర్గంలోని యెర్రబాలెంలో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో ఈ అంశంపై యువత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ “రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్తోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయి. ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్తోనే గతంలో కియా, టిసిఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్ కాన్ వంటి అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు ఐటి కంపెనీలు తీసుకువస్తాము.
రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక యువత డిగ్రీలు చేతబట్టుకొని తల్లితండ్రులను విడిచిపెట్టి పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతుండటం చాలా బాధాకరం. పొరుగు రాష్ట్రాలు పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించుకొని ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నప్పుడు మనం ఎందుకు కల్పించుకోలేము?
ప్రభుత్వానికి సరైన విధానాలు, చిత్తశుద్ధి, దూరదృష్టి ఉంటే పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తాయి. కానీ జగన్ ప్రభుత్వం ఉన్నవాటినే వేధించి తరిమేస్తోంది. కానీ మేము అధికారంలోకి రాగానే వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించి మొదటి వందరోజుల్లోనే విశాఖకు ఐటి పరిశ్రమలు తీసుకువస్తాము. రాష్ట్రంలో యువతకు ఇక్కడే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాము,” అని నారా లోకేష్ చెప్పారు.





