ప్రస్తుతం దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుసాన్ లో నిర్వహించిన బిజినెస్ సెమినార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీలో పెట్టుబడులకు ఎప్పుడూ స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్)లో ముందున్నామని అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో దక్షిణ కొరియా కూడా భాగస్వామి కావాలని స్థానిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్లలో 26 పురస్కారాలను అందుకున్నామని, ‘కియా మోటార్స్ ను అడగండి, ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ ప్యాకేజ్ ఇస్తున్నామని, తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు.
2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల రాష్ట్రంగా ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ముందుకు వెళ్తున్నామని, ఏపీకి కియా మోటార్స్, హీరో, ఇసుజ్, భారత్ బెంజ్ పరిశ్రమలు వస్తున్నట్టు చెప్పారు. ఏపీకి వస్త్ర, మొబైల్ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయని, ఉద్యాన ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్న ఏపీకి వ్యవసాయాధారిత, ఆహారశుద్ధి పరిశ్రమలూ తరలి వస్తున్న విషయాన్ని పేర్కొన్నారు.



