టెక్నాలజీ… ఇది సిఎం చంద్రబాబు నాయుడు బలమూ, బలహీనత కూడా. తాను టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఉండలేనని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పుకున్నారు. ఇది ఆయన బలహీనతగా అనిపించినా ఇదే అయన బలం కూడా. యువకుడినని గొప్పగా చెప్పుకునే జగన్ ఈ విషయంలో ఎన్నటికీ అయన దరిదాపుల్లోకి కూడా రాలేరు.
అయితే గతంలో టెక్నాలజీ, అభివృద్ధి అంటూ వాటి వెంట పరుగులు తీసినందుకు టీడీపి రాజకీయంగా దెబ్బ తింది. కనుక ఈసారి సిఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా రూటు మార్చారు.
ఒకవైపు రాష్ట్రాభివృద్ధి, టెక్నాలజీ ఆలోచనలు, పనులు చేస్తూనే రాజకీయాలపై కూడా దృష్టి పెట్టి వైసీపీని హ్యాండిల్ చేస్తున్నారు.
ఈసారి సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీని ఓ కంట కనిపెట్టి ఉంటూ ఎప్పటికప్పుడు విరుగుడు మందు వేస్తున్నారు. అందువల్లే జగన్లో నానాటికీ ఆసహనం పెరిగిపోతోంది.
ఎన్నికలలో పొత్తులు పెట్టుకొని గెలిచినప్పటికీ అధికారంలోకి వచ్చాక కూటమిలో పార్టీల మద్య కీచులాటలు మొదలవుతాయని, విడిపోయి ప్రభుత్వం కూల్చేసుకుంటాయని, అప్పుడు మళ్ళీ తాను గద్దె ఎక్కవచ్చని జగన్ చాలా ఆశ పడ్డారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు, సూచనల వలన కూటమిలో పార్టీల మద్య బంధం మరింత బలపడింది, ముఖ్యంగా టీడీపి, జనసేనల మద్య బంధం మునుపెన్నడూ లేనంతగా బలపడింది!
‘వచ్చే ఎన్నికలలో మళ్ళీ మేమే గెలిచి అధికారంలోకి వస్తామని’ జగన్ ఒట్టి మాటలు చెపుతూ కాలక్షేపం చేస్తుంటే, సిఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీల బందం మరింత బలపరుచుకుంటున్నారు. తద్వారా జగన్ వలన టీడీపికి, కూటమికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ‘రాజకీయ ప్రమాదం’ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అలాగే సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో బలమైన బంధం ఏర్పరుచుకోవడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. ఈ కారణంగానే రాష్ట్రాభివృద్ధి చాలా వేగవంతం అయ్యింది. గతంలో ఓ ప్రాజెక్టుకి అనుమతి లభించాలంటే దశాబ్దాలు పట్టేది. కానీ ఒక్క ఏడాదిలోనే సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి అనేక ప్రాజెక్టులు సాధించుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి, అనేక పరిశ్రమలు, రైల్, రోడ్ ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలకు చకచక ఆమోదం లభిస్తోంది.
కనుక కూటమిలో పార్టీల బంధం బలపడుతోంది. రాష్ట్రంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రం సహాయ సహకారాలు లభిస్తున్నాయి.
ఇవన్నీ చూసి రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి టెక్నాలజీపై ఉన్న ప్రత్యేక ఆసక్తి కారణంగా క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి.
రాష్ట్రాభివృద్ధి, టెక్నాలజీ, రాజకీయాలు కూడా సరిపోవని సిఎం చంద్రబాబు నాయుడు గ్రహించారు. కనుకనే ఎన్నడూ లేనివిదంగా ఈసారి సంక్షేమ పధకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సూపర్ సిక్స్ హామీలు ఒకటొకటిగా అమలుచేస్తున్నారు.
ఎప్పుడూ అభివృద్ధి, టెక్నాలజీ గురించే ఆలోచించే సిఎం చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పధకాలు అమలుచేస్తారని జగన్ ఊహించలేకపోయారు. కనుక ఆయనదో తన చేతిలో కూడు లాగేసుకున్నట్లు జగన్ విలవిలలాడుతున్నారు.
కనుక 2014-2019లో చూసిన సిఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు చూస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుకి చాలా తేడా ఉందని అర్దమవుతోంది.
అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క చంద్రబాబు నాయుడు సరిపోరన్నట్లు, త్రీడీ ప్రింటింగ్ చేసుకున్నట్లు ఒకేసారి మూడు వేర్వేరు రూపాలలో ‘మల్టీ టాస్కింగ్’ చేస్తున్నారనుకోవచ్చు.
రాష్ట్ర విభజన వలన ఒకసారి, జగన్ 5 ఏళ్ళ పాలన వలన మరోసారి ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. కనుక ఎదురుదెబ్బలు తిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ త్రీడీ-చంద్రబాబు నాయుడు చాలా అవసరమే.




