గత ఎన్నికలకు ముందు టిడిపి స్వయంకృతం వలన కొంత, చంద్రబాబు నాయుడు శత్రువులందరూ ఏకం కావడం వలన మరికొంత అధికారం కోల్పోయారు.
ఆ తర్వాత నుంచి టిడిపి చాలా అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా అన్నిటినీ తట్టుకొని నిలబడి, వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలిగే స్థితికి చేరుకొంది. అయితే ఊహించని విదంగా వైసీపి ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు నమోదు చేసి జైలుకి పంపడంతో టిడిపి కంగు తింది.
అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు కనుక వెంటనే బెయిల్ పొంది బయటకు వచ్చేస్తారనే టిడిపి నేతలందరూ గట్టి నమ్మకంతో ఉండేవారు. కానీ జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్ని న్యాయ పోరాటాలు చేస్తున్నా ఎక్కడా ఉపశమనం లభించడం లేదు. దాంతో మూడు వారాలుగా జైల్లోనే ఉన్నారు.
ఇప్పుడు వైసీపి ప్రభుత్వం నారా లోకేశ్, మిగిలిన ముఖ్య నేతలను కూడా అరెస్ట్ చేయించి జైలుకి పంపేందుకు సిద్దం అవుతుండటంతో టిడిపి తీవ్ర ఆందోళన చెందుతోంది.
ఇదే సమయంలో మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే ఇదివరకు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఓటుకి నోటు కేసులో వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రావడం యాదృచ్చికమే అయినా ఆ కేసులో మళ్ళీ ఏమి జరుగుతుందో అని టిడిపి నేతలు ఆందోళన చెండుతున్నారు.
నిజానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుని, రేవంత్ రెడ్డిని బుక్ చేయాలని ఆనాడు తెలంగాణ సిఎం కేసీఆర్ చాలా ప్రయత్నించారు. కానీ తర్వాత వెనక్కు తగ్గారు. కానీ 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని గద్దె దించి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తెరవెనుక నుంచి కేసీఆర్ చాలా తోడ్పడ్డారు. మోడీ, అమిత్ షాలు కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నందున బహుశః వారు కూడా ఓ చెయ్యి వేసి ఉండవచ్చు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు, టిడిపి ఎదుర్కొంటున్న ఈ సమస్యలు, కోర్టులో ఎదురుదెబ్బలు, ఎప్పటిదో ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఇప్పుడే విచారణకు రావడం చూస్తుంటే, 2019కి ముందు టిడిపిని దెబ్బ తీయడానికి చంద్రబాబు నాయుడు శత్రువులందరూ చేతులు కలిపినట్లే, మళ్ళీ ఇప్పుడూ అందరూ తెరవెనుక చేతులు కలిపిన్నట్లనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడుని వైసీపి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టి మూడు వారాలవుతున్నా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సిఎం కేసీఆర్ ముగ్గురూ స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఇటువంటి పరిస్థితులే ఉండేవి. కనుక చంద్రబాబు నాయుడుని, టిడిపిని దెబ్బ తీసేందుకు తెర వెనుక ఏదో జరుగుతోందని స్పష్టం అవుతోంది. కానీ చంద్రబాబు నాయుడు, టిడిపిపై కక్ష సాధిస్తున్నట్లు కాక అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పగబట్టిన్నట్లు అనిపిస్తోంది.





