జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని వెంటనే పార్టీ నుండి బహిష్కరించి, పోలీస్ కేసు నమోదు చేయించి జైలుకి పంపిచారు.
ఒకవేళ అతనిపై చర్యలు తీసుకోకపోయినా సిఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ విరుచుకుపడుతుంది. కనుక టీడీపీ కార్యకర్త అని కూడా చూడకుండా అతనిపై ఇంత కటినంగా, వేగంగా చర్యలు తీసుకున్నందుకు వైసీపీ అభినందించాలి.
కానీ ఇది కూడా పెద్ద డ్రామా అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.
కనుక జగన్ సతీమణిని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం సబాబా కాదో వైసీపీ నేతలే చెప్పాలి.
గత శాసనసభలో కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు వంటి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని, రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడుతుంటే, జగన్ వారిని వారించకుండా ముసిముసినవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం అనుభవించారు.
జగన్ స్వయంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి ఎంత వెకిలిగా మాట్లాడేవారో అందరూ విన్నారు. కానీ ఓ సామాన్య కార్యకర్త జగన్ సతీమణిని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడితే సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే కఠిన చర్యలు తీసుకోవడమే గాకుండా, ఈవిదంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు.
“సమాజంలో అందరూ గౌరవంగా బ్రతికనీయండి. కనీస నైతిక విలువలు పాటించడం తప్పనిసరి. చేతనైతే వాటిని ఇతరులకు కూడా నేర్పండి. సమాజం హితం కోసమే పనిచేద్దాం. సమాజ హితం కోసమే సోషల్ మీడియాని వాడుకుందాము. అంతే తప్ప సోషల్ మీడియాలో ఇతరుల వ్యక్తిత్వానికి నష్టం కలిగించేవిదంగా పోస్టులు పెడతామంటే సహించే ప్రసక్తే లేదు. పద్దతిగా రాజకీయాలు చేయలేమనుకుంటే ఇంట్లో పడుకోండి. ఇలాంటి నీచ రాజకీయాలు మనకి అవసరం లేదు,” అని సిఎం చంద్రబాబు నాయుడు ఖరాఖండీగా చెప్పారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు లేదా మద్దతుదారులు తప్పుగా వ్యవహరిస్తుంటే సరిచేయాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతదే కనుక చంద్రబాబు నాయుడు వెంటనే సరిచేస్తున్నారు. కానీ జగన్ ఏం చేస్తున్నారు?
తల్లిని, సొంత చెల్లిని, చనిపోయిన బాబాయ్ వివేకానంద రెడ్డిని, ఆయన కుమార్తె, అల్లుడిని కూడా విడిచిపెట్టడం లేదు. ఇక తన రాజకీయ ప్రత్యర్ధుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరిస్తారా?వ్యవహరించకపోతే అందుకు ఆయన, వైసీపీయే మూల్యం చెల్లిస్తుంది కానీ తన సతీమణి గురించి అనుచితంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తపై ఆ పార్టీ, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే వైసీపీ స్పందిస్తున్న తీరు సబబేనా?అని ఆలోచిస్తే బాగుంటుంది.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా భువనేశ్వరి, టీడీపీ ముఖ్య నేతలను కించపరిచిన వైసీపీ నేతలు, వైసీపీ మద్దతుదారుల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తూ, టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై కఠిన చర్యలు తీసుకోవడానికి క్షణం ఆలోచించలేదని టీడీపీ మద్దతుదారులే దెప్పిపొడుస్తున్నా సిఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదనే విషయం కూడా వైసీపీ నేతలకు తెలియనిదా?
టీడీపీలో అందరినీ పద్దతిగా రాజకీయాలు చేసుకోమని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. జగన్ కూడా వైసీపీలకు చెప్పగలరా?






