ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. వేడి, వడగాడ్పులకు భయపడి ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏసీలు, కూలర్లు ఉన్నవారు అక్కడే కాలక్షేపం చేస్తున్నారు.
విశాఖ నగరం సముద్ర తీరంలో ఉన్నందున ఈ ఎండలు, వడగాడ్పులకు తోడు వాతావరణంలో విపరీతమైన తేమ (హ్యుమిడిటీ) కూడా ఉంటుంది. అది మరో రకమైన ఇబ్బంది సృష్టిస్తుంటుంది. కనుక ఏసీలున్నవారు అక్కడే కాలక్షేపం చేస్తున్నారు. లేనివారు అలాగే తిప్పలు పడుతున్నారు.
ఇలాంటి విపరీత వాతావరణంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీచ్ ఒడ్డున గల నోవా టెల్ హోటల్ వరకు సుమారు ఐదున్నర కిమీ సైకిల్ తొక్కుతూ సైకిల్ ర్యాలీలో పాల్గొనడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ వయసు (76)లో ఏసీ గదులలో కూర్చొని ప్రభుత్వ పనులు చక్కబెట్టడమే గొప్ప విషయం. కానీ యువకుడినని చెప్పుకునే మాజీ సిఎం జగన్, అపర చాణక్యుడినని చెప్పుకునే తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఇద్దరూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంటే, సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ వయసులో, ఇటువంటి విపరీత వాతావరణంలో సైకిల్ ర్యాలీలో పాల్గొనడం విశేషమే కదా?
ముందుగా ఆంధ్రా యూనివర్సిటీలో అంతటా కలియ తిరుగుతూ ప్రొఫెసర్లు, విదార్ధులు, సిబ్బంది అందరితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలోపరిశుభ్రత, విద్యా ప్రమాణాలు పర్యావరణం, బయోగ్యాస్ వాడకం తదితర అంశాల గురించి దిశా నిర్దేశం చేశారు.
ఆ తర్వాత యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది మళ్ళీ యూనివర్సిటీకి వస్తానని అప్పటికి పచ్చదనం పెరగాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం తర్వాత యూనివర్సిటీ నుంచి సైకిల్ తొక్కుతూ బీచ్ రోడ్లోని నోవా టెల్ హోటల్ చేరుకున్నారు.
రాజకీయాలలో ఉన్నవారు తప్పనిసరిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి కాపాడుకోవాలని ఇటీవల ప్రధాని మోడీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ని కలిసినప్పుడు చెప్పారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నా ఎన్నడూ తీవ్ర అనారోగ్యం పాలైన దాఖలాలు లేవు.
ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా నిత్యం ప్రజల మద్యనే కనిపిస్తుంటారు. ఆయన చురుకుదనం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతుంటారు.
ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా, చురుకుగా పనిచేయడానికి అయన ఏం తింటారో… ఏం చేస్తారో? అని అందరూ అనుకుంటారు. కానీ సమయానికి మితాహారం.. ప్రతీరోజు తెల్లవారుజామున క్రమం తప్పకుండా యోగా, తేలికపాటి వ్యాయామాలు చేస్తుంటారు. అంతే. ఆరోగ్యం కాపాడుకోవడం ఇంత సింపులా? అనిపిస్తోంది కదా? మరెందుకు ఆలస్యం పాటించండి.




