బీజేపీకి ఇంకో అవకాశం ఇస్తూ ప్రస్తుతానికి ఎన్డీయేని వీడాలనే నిర్ణయం పక్కన పెట్టింది టీడీపీ. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడానికి వారు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్లో యుద్ధానికి టీడీపీ సిద్ధకావాలని, ఎవరు ఏం చెప్పినా తగ్గొద్దని ఎంపీలకు సీఎం చంద్రబాబు టీడీపీపీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
ఒకరకంగా ఇది బీజేపీకి దక్షిణాన తన అతిపెద్ద పార్టనర్ ని నిలుపుకోవడానికి చివరి అవకాశం అని చెప్పుకోవాలి. అయితే దీంట్లో చంద్రబాబు కు పెద్ద రిస్క్ ఉందనే చెప్పుకోవాలి. దీని తరువాత కూడా బీజేపీ తన వైఖరి మార్చుకోకపోతే చంద్రబాబుని నిందించాల్సిన పరిస్థితి తప్పదు. ఇప్పుడు ఉన్న వేడి మీద ఎన్డీయే నుండి బయటకు వస్తే ప్రజా మద్దత్తు కూడా ఉండేది.
ఇప్పుడు ఈ చివరి అవకాశం ప్రతిపక్షం చేతిలో పాశుపతాస్త్రం కాబోతుంది. టీడీపీ నిర్ణయం వెలువడగానే సాక్షి ‘ముగిసిన నాటకం : బీజేపీతోనే టీడీపీ’ అనే పేరుతో వార్తలు మొదలు పెట్టింది. ఇప్పటికే కేంద్రం చేసిన అన్యాయానికి చంద్రబాబుని నిందిస్తున్న జగన్ దానిని మరింత ఎక్కువ చేస్తారు రానున్న రోజులలో.
ఏ రకంగా చూసిన ఈ చివరి అవకాశం రిస్క్ తో కూడుకున్నదే. రేపటి నుండి పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు ఎలా పోరాడతారు అనే దాని బట్టే టీడీపీ భవిష్యత్తు ఆధారపడనుంది. అవసరమైతే పార్లమెంట్ ను స్తంభింప చెయ్యాలి కూడా. చూడాలి కేంద్రం వైఖరి కొంత మేర అయినా మారుతుందేమో.



