నువ్వు నా కంటే తెలివైనవాడివా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 టీవీ రిపోర్టర్ పై మండిపడ్డారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రత్యేక హోదాను మించిన సాయం చేస్తామని కేంద్రం చెప్పిందని, విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పెట్టలేదని, అలాంటప్పుడు హోదా కావాలని ఎలా ప్రశ్నిస్తామని చెప్పారు.
కేంద్రం తమకు అన్ని విషయాల్లో సహకరిస్తుందని, అలాంటప్పుడు కేంద్రంతో ఘర్షణ ఎందుకని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న ప్రతి విషయాన్ని అమలు చేస్తున్నప్పుడు మళ్లీ ఆందోళనలు ఎందుకని అడిగారు. కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని, భాగస్వామ్య సదస్సును విఫలం చేయాలన్న లక్ష్యంతోనే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి రేపి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చెప్పిన సందర్భంలో 10 టీవీ రిపోర్టర్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయని అంతా చెబుతున్నారనగానే అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి… నువ్వే ఛానెల్ రిపోర్టర్ అని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు? ఆ జీవో చూపించగలవా? నువ్వు నాకంటే తెలివైన వాడివా? అయితే చూపించు… నేనేం చెబుతున్నానో అది విను అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు.
జాతీయ ఛానెల్స్ తాను ఎలా చెబితే అలా రాసుకున్నాయని, స్టేట్ మీడియా మాత్రం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటివి రావాల్సి ఉందని వాటి కోసం అడుగుతామని, బకాయిలు చెల్లించాలని అడుగుతున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా ఉందని, ప్రజలను విపక్ష పార్టీలు తప్పుదోవపట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017



