ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సీట్ల సర్దుబాట్లపై ముగ్గురూ ఓ అంగీకారానికి రావడంతో టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు ఖాయం అయ్యింది. సుమారు 50 నిమిషాల సేపు ముగ్గురూ సమావేశమై సీట్ల సర్దుబాట్లపై లోతుగా చర్చించి ఓ అంగీకారానికి వచ్చారు. రెండు పార్టీల మద్య పొత్తు కుదరడంతో మళ్ళీ ఎన్డీయే కూటమిలో చేరవలసిందిగా అమిత్ షా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
తాజా సమాచారం ప్రకారం బీజేపీకి రాజంపేట, హిందూపూర్, తిరుపతి, నర్సాపురం, రాజమండ్రి, అరకు ఎంపీ సీట్లు, 6-8 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించారు. బీజేపీ, జనసేనలకు కలిపి మొత్తం 8 ఎంపీ, 30 ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేయబోతుండగా, టిడిపి 17 ఎంపీ, 145 ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేయబోతోంది.
ఈ పొత్తులపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వారితో భేటీ అయ్యి, ముగ్గురూ కలిసి అభ్యర్ధుల జాబితాని ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నెల 17న చిలుకలూరిపేటలో టిడిపి, జనసేనలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించి దానిలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించబోతున్నాయి. ఇప్పుడు వాటితో బీజేపీకి పొత్తు కుదిరింది కనుక ఈ సభలో బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
అక్కడ ఢిల్లీలో మూడు పార్టీల పొత్తులు ఖరారు అయిన్నట్లు వార్తలు వస్తుంటే, అమిత్ షాతో చర్చలు ఫలించలేదని, పొత్తులు కుదరలేదని, ముగ్గురూ కలిసి సంయుక్త ప్రకటన చేయకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారని, కానీ టిడిపి, జనసేనల నేతలు బీజేపీతో పొత్తులు కుదిరాయంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆత్మసాక్షి అక్కసు వెళ్ళగ్రక్కుతుండటం విశేషం.
ఉట్టిలో ఉన్న పాలు అందకపోతే అది తెగి పడిపోవాలని పిల్లి శాపాలు పెట్టిందిట! అలాగే ఉంది ఇది కూడాను. పిల్లి శాపాలకు ఉట్టి తెగదు… వైసీపి ఏడుపులతో పొత్తులు నిలిచిపోవు.
అయినా సింగిల్ సింహం… చొక్కా మడత పెట్టి… యుద్ధం… సిద్దం అంటూ 175/25 మావే అని చెప్పుకొంటున్నప్పుడు మళ్ళీ ఈ ఏడుపులు, భయం, ఆందోళన దేనికో?





