దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం నుంచి రేపు అనకాపల్లి వరకు చేరుకోబోతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపురం పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసిన నీళ్ళు పోలవరం ఎడమ కాలువ ద్వారా నర్సీపట్నం చేరుకుంటాయి.
అక్కడ ఏర్పాటు చేసిన అక్విడక్ట్ గేట్లను ఎత్తి సిఎం చంద్రబాబు నాయుడు రేపు ఉదయం గోదావరి నీటిని దిగువకు విడుదల చేసి జలహారతి ఇస్తారు.
అక్కడి నుంచి గోదావరి నీళ్ళు గలగలాపారుతూ అనకాపల్లి చేరుకుంటాయి. వాటితో జిల్లాలోని 110 చెరువులు నింపుతారు. ఆ చెరువుల కింద సాగవుతున్న 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే 143 గ్రామాలలో 4.23 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఇది కాక ఏలేరులో మరో 1.39 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. అంటే ఈ సుజల స్రవంతి పధకం ద్వారా ప్రస్తుతం అందబోతున్న గోదావరి నీళ్ళతో మొత్తం 2.87 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుందన్న మాట!
వీటి తర్వాత విశాఖ నగరానికి తాగు నీరు అందించే మేఘాద్రిగెడ్డ జలాశయానికి, అక్కడి నుంచి విజయనగరం జిల్లాకు గోదావరి నీటిని తరలిస్తారు.
కృష్ణా నది నీళ్ళతో వెలిగొండ ద్వారా మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగు,తాగు నీటిని అందిస్తే, పోలవరం నుంచి గోదావరి ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు సాగు,తాగు నీరు అందుతుంది.
మా తెలుగు తల్లికి మంగళారతులు.. గలగలా గోదావరి, బిరబిర కృష్ణమ్మ… దశాబ్దాల క్రితం ఊహించుకున్న కల నేటికి నెరవేరబోతోంది. సిఎం చంద్రబాబు నాయుడు జన్మ ధన్యం అయ్యింది.







