పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ముఖ్యమంత్రులలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులు కూడా వేరేగా ఉంటారు. ఆ కోవకు చెందినవారే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.
ఆయనేదో టైమ్ ట్రావెల్ చేస్తున్నట్లు ఎప్పుడూ ఓ 30 ఏళ్ళు ముందే ఉంటారు. కనుక ఆయన ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులు చాలా మందికి అర్థం కావు.
కనుకనే పాములు తేళ్ళు తిరిగే రాళ్ళ గుట్టల మద్య హైటెక్ సిటీ అన్నప్పుడూ అందరూ నవ్వారు. కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నప్పుడూ చాలా మంది పళ్ళికిలించారు. అమరావతి అన్నప్పుడు, నిర్మిస్తున్నప్పుడు కూడా ‘మావిగన్లు’ పళ్ళికిలిస్తూనే ఉన్నారు.
అలాగని ఆయన ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. వెనక్కు తగ్గలేదు. అందువల్లే 30 ఏళ్ళ క్రితం ఆయన ఆలోచనలు ఒడిసిపట్టి లాభపడినవారు, 30 ఏళ్ళ తర్వాత జ్ఞానోదయం అయినవారు కూడా అయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఆయన మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత పరిస్థితిని అంచనా వేసి అందరూ పిల్లలని కనాలని, జనాభా పెంచాలని హుకుం జారీ చేశారు. కనుక మళ్ళీ పకపకలు, వికవికలు, వెక్కిరింతలు మామూలే.
నేటికీ చాలా మందికి క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటో తెలీని పరిస్థితి. కానీ ఆయన వాటి ‘టెస్ట్ బెడ్స్’ ప్రారంభోత్సవం చేశారు. ఈ టెస్ట్ బెడ్స్ పిల్లలు కనడానికేనా? అని అడిగేవారు కూడా ఉన్నారంటే నమ్మండి.
ముందే చెప్పుకున్నట్లు ఇలాంటి వెటకారాలకు ఆయన అతీతుడు. కనుక ఇవాళ్ళ ‘రాష్ట్రంలో ఫెర్టిలిటీ పర్సంటేజ్’ మీద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు!!!
రాష్ట్రంలో సగటు ఫెర్టిలిటీ 1.5 శాతం కాగా దానిని 2.1 శాతానికి పెంచేందుకు తగిన ప్రణాళికలు, కార్యాచరణ రూపొందించాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు!!!
ఏవిటో ఈ బాబు… ఎప్పుడూ ఇలాంటి అర్థం కాని మాటలే మాట్లాడుతూ పని చేయమంటారు… అని అనిపిస్తోందా? అనిపిస్తే ఓ ముప్పై ఏళ్ళు వేచి చూస్తే అర్ధమవుతుంది. జస్ట్ వెయిట్ ఇఫ్ యూ కెన్!




