వెన్నుపోటు దుష్ప్రచారానికి టిడిపి వద్ద సమాధానం లేదా?

Chandrababu-Naidu-Sr-NTR-TDPరోజా ఏనాటికైనా మంత్రి అవ్వాలని తపించిపోయి చివరికి జగన్ దయ వలన పర్యాటకశాఖ మంత్రి కాగలిగారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆమె ఏనాడూ తన మంత్రిత్వ శాఖ గురించి కానీ, రాష్ట్రం పర్యాటక రంగం అభివృద్ధి గురించి గానీ మాట్లాడిన దాఖలాలు లేవు. ఆమెకు నిరంతరంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను అవహేళన చేస్తుండటమే బాధ్యతగా అప్పగించిన్నట్లున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి మీడియాలో చెలరేగిపోతున్న ఆమె నిన్న నందమూరి బాలకృష్ణని ‘ఓ మెంటల్ పేషంట్‌ గాడు’ అనేందుకు ఏమాత్రం జంకలేదు. మళ్ళీ ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతు పలికారంటూ విరుచుకుపడ్డారు.

వైసీపి నేతలు నిరంతగా ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. తద్వారా చివరికి అదే నిజమని ప్రజలను కూడా నమ్మించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఎన్టీఆర్‌ చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు టిడిపిని తీసుకోవడం వెనుక అసలు కధ అందరికీ తెలిసిందే. ఆనాడు టిడిపి లక్ష్మీ పార్వతి చేతిలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు తన మావగారైన ఎన్టీఆర్‌ను ఎదిరించి ఆయన చేతిలో నుంచి పార్టీని తీసుకొన్నారనే సంగతి రాష్ట్ర ప్రజలకు, టిడిపి నేతలకు, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు. అందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదించారు కనుకనే మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు.

ఒకవేళ వైసీపి నేతలు వాదిస్తున్నట్లు, చంద్రబాబు నాయుడు తప్పు చేశారని కేవలం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే గట్టిగా నమ్మినా వారందరూ చంద్రబాబు నాయుడుని అడ్డుకొని ఉండేవారే కదా?ఒకవేళ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరూ అడ్డుకొని ఉంటే చంద్రబాబు నాయుడుకి టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు మద్దతు పలికేవారా?అంటే కాదనే అర్దమవుతోంది.

మరి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఆయనను ఎందుకు అడ్డుకోలేదు? అంటే లక్ష్మీపార్వతి దొడ్డిదారిన తమ కుటుంబంలోకి ప్రవేశించి తమ తండ్రిని బుట్టలో వేసుకొన్నాక, ఆయన స్థాపించిన పార్టీని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారందరూ గ్రహించడం వలననే.

తమ తండ్రి స్థాపించిన టిడిపి ఆమె చేతిలోకి వెళ్ళిపోవడం కంటే తమ కుటుంబ సభ్యుడైన చంద్రబాబు నాయుడు చేతిలో ఉండటమే మంచిదని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు అందరూ భావించబట్టే ఆనాడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు..అడ్డుపడలేదు.

అయితే అటు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కానీ చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు గానీ ఈవిషయాలన్నీ ప్రజలకు వివరించడంలో అలసత్వం వహించారు కనుకనే నేటికీ జగన్, రోజా, కొడాలి, అంబటి వంటి నేతలు వెన్నుపోటు కధను కంటిన్యూ చేస్తూ ఇంతకాలం చంద్రబాబు నాయుడుని, ఇప్పుడు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను కూడా ప్రజల మూడు దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ టిడిపి మాత్రం వారికి చెక్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. కనుక ఈ వెన్నుపోటు కధ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories