ఒక్క మోడీ నిర్ణయం మినహా రాజకీయంగా, సామాజికంగా దేశాన్ని ప్రభావితం చేసిన అంశాలు లేవు. దీంతో రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలలోనూ ‘పెద్ద నోట్ల రద్దు’పై చర్చలు జరుగుతున్నాయి. మరి దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజల నిర్ణయం ఎలా ఉంది? మోడీ నిర్ణయాన్ని స్వాగతించారా? విభేదించారా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సర్వే జరిపించినట్లుగా తెలుస్తోంది.
ఈ సర్వేలో నోట్ల రద్దును 52 శాతం మంది ప్రజలు స్వాగతిస్తుండగా, 48 శాతం మంది రద్దుతో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పినట్లుగా సమాచారం. ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకునేందుకు ఫోన్ కాల్స్ ద్వారా చేయించిన ఈ సర్వేలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నోట్ల రద్దు సమస్య ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించినట్లుగా ఈ సర్వే ద్వారా తెలిసినట్లుంది. దీంతో ప్రతి రోజు ఈ సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు.
సర్వేలో వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చంద్రబాబు కసరత్తు చేసే క్రమంలో నిర్వహించిన ఆర్బీఐ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అధికారుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడడంతో, దానిని దృష్టిలో ఉంచుకుని సరిపడ చిల్లర కూడా అందుబాటులోకి తేవాలని సూచనలు చేసారు.



