చాలా కీలకమైన సమ్మర్ సీజన్ మొత్తాన్ని వృథా చేసుకున్న తెలుగు చిత్రసీమ, ఇప్పుడు మాత్రం వరుసబెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్ని థియేటర్లకి రాబట్టడానికి నానా తంటాలు పడుతున్నారు.
ఈ శుక్రవారం (జూలై 17) ఏదో క్లియరెన్స్ సేల్ లాగా ఏకంగా 10 సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలున్నాయి, అసలు ఎవరికీ తెలియని సినిమాలున్నాయి. అయితే.. ఏ ఒక్క సినిమాకీ కనీస స్థాయి బజ్ లేకపోవడం అనేది ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం.
తిరువీర్-ఐశ్వర్య రాజేష్ నటించిన “ఓ సుకుమారి”, జగపతిబాబు నటించిన “వదలా”, శ్రీకాంత్ నటించిన “మిస్టర్ మిడిల్ క్లాస్”, పోసాని కృష్ణమురళి “ఆపరేషన్ అరుణ రెడ్డి”, కొత్తవాళ్లు కాస్త ఎక్కువ బడ్జెట్ తో తీసిన “రాజా ది రాజా” వంటి సినిమాలతోపాటుగా “ఒక కోర్టు కేస్, జీడీఎన్, మహాప్రభు జగన్నాథ్, భగవాన్, వెంకట్రామయ్య గారి తాలూక వంటి సినిమాలు ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి.
వీటిలో ఓ సుకుమారి, వదలా తప్ప మిగతా సినిమాలు కనీసం విడుదలవుతున్నట్లు కూడా జనాలకి తెలియదు. ఒకవేళ తెలిసినా టికెట్ బుక్ చేసుకుని థియేటర్ కి వచ్చే స్థాయి ఆసక్తిని ఆ సినిమాలు క్రియేట్ చేయలేకపోయాయి.
బజ్ క్రియేట్ చేయకపోవడం అటుంచితే.. ఇదే శుక్రవారం విడుదలవుతున్న “ఒడిస్సీ” లాంటి సినిమా ముందు ఈ చిన్న సినిమాలు అసలు నిలదొక్కుకోగలగడం అనేది గగనమే.




