ప్రజా విశ్వాసం : చంద్రబాబు Vs జగన్!

chandrababu naidu - Jaganఅమరావతి పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని, ముఖ్యంగా టిడిపి నేతలు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని కోర్టులో కేసులు వేసిన ‘వైసీపీ అండ్ కో’కు అంతిమంగా నిరాశ ఎదురు కాక తప్పలేదు. టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యవహారం ఎలా ఉన్నా, తాజాగా జగన్ సర్కార్ మాత్రం అధికారికంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగింది.

మొదటి దశలో భాగంగా ధర్మవరం (5999), రాయచోటి (4600), కందుకూరు (6999), కావలి (4999), నవులూరు (17499) మరియు ఏలూరు (8999) ప్రాంతాలలో ప్రభుత్వమే ప్లాట్స్ వేసి ప్రజలకు విక్రయించనుంది. దఫాల వారీగా పేమెంట్ ప్రక్రియను రూపొందించారు. చదరపు గజం ఒకటికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రైవేట్ ధరకు ఎక్కువ ఉందో, తక్కువ ఉందో అన్నది పక్కన పెడితే, అసలు ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందన్నది కీలకంగా మారింది.

ADVERTISEMENT

ఇప్పటినుండి జగన్ సర్కార్ పాలనలో ఉండేది కేవలం రెండేళ్లు మాత్రమే. చివరి ఆరు నెలలు ఎలాంటి అభివృద్ధికి ఆస్కారం ఉండదు, కేవలం ఎన్నికల ప్రచారం తప్ప! మరి ఈ రెండేళ్ళల్లో జగన్ సర్కార్ ఎంపిక చేసిన అన్ని ప్రాంతాలలో ప్లాట్స్ ను విభజించి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ తదితర సదుపాయాలన్నింటిని అమలులోకి తీసుకువస్తుందా? అన్నది ప్రశ్నార్ధకమే!

ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే పేద ప్రజలకు ఉచితంగా స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను ఎంపిక చేసారు. స్థలాలు ఇవ్వలేదు గానీ, పేపర్ పై ఫలానా చోటులో మీకు స్థలం వచ్చిందని జగన్ బొమ్మతో కూడిన ఫైల్ ను అందించారు. ఆయా ప్రాంతాలలో భూములను తీసుకున్న ప్రభుత్వం, ఇప్పటివరకు వాటిని అభివృద్ధి చేసి పేద ప్రజల చేతికి ఇవ్వలేకపోయింది.

దీంతో ఇప్పటికే జగన్ సర్కార్ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక తెరపైకి తీసుకువచ్చిన మూడు రాజధానుల అంశం అత్యంత కీలకం కానుంది. రాజధానికే దిక్కులేక అమరావతి ప్రాంత రైతులంతా గత రెండేళ్లుగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్న విషయం బహిరంగమే. అధికారం చేతిలో ఉంటే రాజధాని అంశాన్నే తలక్రిందులు చేయవచ్చన్న విషయం ఈ సందర్భంగా ప్రజలకు తెలిసి వచ్చింది.

ఒకవేళ తదుపరి ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి రాని పక్షంలో ఈ ప్లాట్స్ ను ఎవరు పూర్తి చేసి ఇస్తారు? అన్న ప్రశ్న ప్రజల మదిలో మెదులుతున్నాయి. చట్టప్రకారం అసెంబ్లీలో బిల్లులు చేసిన రాజధానికే దిక్కులేకపోతే, నేడు జగన్ బొమ్మతో కూడిన పేపర్ ముక్కపై ఇచ్చే కాగితాలకు ఎవరు బదులిస్తారు? ప్రజల మదిలో నెలకొన్న ఇలాంటి అనేక సందేహాలను నివృత్తి చేసే విధంగా జగన్ సర్కార్ వివరణ ఇచ్చి ఈ ప్లాట్స్ ను విక్రయిస్తే బాగుంటుందేమో!?

అలాగే చంద్రబాబును నమ్మి కొన్ని లక్షల కోట్ల విలువైన 33000 ఎకరాల భూమిని తృణప్రాయంగా చేతిలో పెట్టారు. మరి జగన్ ను నమ్మి కనీసం లక్షల విలువ చేసే చదరపు గజాల ప్లాట్స్ ను కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తారా? అన్నది రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన అంశం. బహుశా ఈ ప్లాట్స్ ను ప్రజలు కొనుగోలు చేసే విధానమే తదుపరి ఎన్నికల తీర్పుకు నిదర్శనంగా మారబోతోందా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories