గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు, అధికారుల బదిలీలు వంటి కొన్ని మార్పులు తప్ప మిగిలిన పనులన్నీ యధాతధంగా సాగుతుండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని పునః సమీక్షించి నిలిపివేస్తున్నాయి.
ఉదాహరణకి జగన్ అధికారంలోకి రాగానే అమరావతి పనులు నిలిపివేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు నిలిపివేశారు. అన్నా క్యాంటీన్లు మూసివేయించారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ చంద్రబాబు నాయుడుపై అసూయ లేదా ద్వేషంతో చేసిన పనులే. వీటితో రాష్ట్రానికి లక్షల కోట్లు నష్టం, 5 ఏళ్ళ విలువైన సమయం వృధా అయ్యాయి.
ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం తప్పులను సరిదిద్దడమే పెద్ద పనిగా మారిపోయింది. జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను కనిపెట్టి వెలికి తీయాల్సి వస్తోంది. జగన్ ప్రభుత్వం తీర్చేందుకు ఆదాయ మార్గాలను ఆన్వేషించాల్సి వస్తోంది.
ఈరోజు ఏపీ సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ పలు నిర్ణయాలను తీసుకుంది. ఆ వివరాలు:
· రివర్స్ టెండరింగ్ రద్దు. మళ్ళీ పాత పద్దతిలోనే టెండర్ల విధానం.
· పోలవరం ఎడమ కాలువ పనులు పునరుద్దరణకు ఆమోదం. ఇదివరకు ఆ పనులు చేసిన పాత గుత్తేదారు సంస్థని కొనసాగించాలని నిర్ణయించారు. కాలువ సామర్ధ్యం 6,000 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు.
· ఫ్రీహోల్డ్, అసైన్డ్ తదితర వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని నిర్ణయించారు.
· స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేసి మళ్ళీ అబ్కరీ శాఖ పునరుద్దరణ, పునర్వ్యవస్థీకరణకు ఆమోదం.
· పట్టాదారు పాసుపుస్తకాలు జగన్ ఫోటోలు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. సర్వే రాళ్ళపై వైసీపి రంగులు, జగన్ బొమ్మలు తొలగించాలని నిర్ణయించారు.
· రిజిస్ట్రార్ కార్యాలయాలలో రాచరిక పోకడలని సూచిస్తున్నట్లుగా ఉండే రిజిస్ట్రార్ ఉన్నతాసనం, చుట్టూ బోను తొలగించి, కార్యాలయ ఉద్యోగులతో కలిసి కూర్చొని పనిచేసేలా మార్పులు చేయాలని నిర్ణయించారు.
· రాష్ట్రంలో కొత్తగా 2,771 తెల్ల రేషన్ కార్డులు దుకాణాలు ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్.
· మునిసిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నేటి నుంచి ఇక ముందు కాగితాలు వినియోగించకుండా డిజిటల్ పరికరాలతోనే మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.




