రాజకీయ పార్టీలకు ఎన్నికలు, అధికారం, పదవులు చాలా ముఖ్యమే. కానీ ప్రతీసారి వాటితోనే చాలా తలనొప్పులు ఊహించని సమస్యలు భరించాల్సివస్తుంటుంది. విజయవాడ మేయర్ పదవికి అభ్యర్ధి ఎన్నిక కూడా అటువంటిదే.
ఈ పదవి కోసం టీడీపి, జనసేనలో పలువురు సీనియర్లు, యువ నేతలు పోటీ పడుతున్నారు. కొందరు కుల సమీకరణాలు చూసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, మరికొందరు తమ సీనియారిటీ, పార్టీకి తాము చేసిన సేవలు చూసి తమకు లేదా తమ పుత్ర రత్నాలకు మేయర్ పదవి ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడుని, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ని, మంత్రి నారా లోకేష్ని కలిసి కోరుతున్నారు.
ప్రస్తుతం టీడీపిలో ఈ పదవి కోసం బొండా ఉమా కుమారుడు బొండా సిద్ధార్థ్, కొమ్మారెడ్డి పట్టాభి, దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, గద్దె అనురాధ, గన్నె వెంకటనారాయణ ప్రసాద్, ముమ్మనేని ప్రసాద్, కోనేరు శ్రీధర్, ఎర్రబోతు రమణారావు, కాకు మల్లికార్జున యాదవ్ ఇంకా పలువురు పోటీ పడుతున్నారు.
వీరిలో పలువురు ఇప్పటికే సిఎం చంద్రబాబు నాయుడుని కలవగా, తాజాగా చందు దేవేనేని మంత్రి నారా లోకేష్ని మర్యాదపూర్వకంగా కలిశారు. మిగిలినవారు కూడా ఈసారి మేయర్ పదవి తమకే ఇవ్వాలని అభ్యర్దిస్తున్నారు.
ఇక జనసేన పార్టీలో అమ్మిశెట్టి వాసు, పి. సుబ్బారాయుడు మరికొందరు మేయర్ పదవి ఆశిస్తున్నారు. బిజేపిలో ఒకరిద్దరు మేయర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
కనుక ఒక్క మేయర్ పదవి దక్కించుకోవడం ఇంత మంది పోటీ పడుతున్నప్పుడు వారిలో నుంచి ఇటు కూటమి ప్రభుత్వానికి, మూడు పార్టీలకు, విజయవాడ ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేయడం సిఎం చంద్రబాబు నాయుడుకి కత్తి మీద సామువంటిదే.
కానీ అయన తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి కత్తి మీద సాములు చాలానే చేశారు. కనుక ఈసారి సాము చేసి ఎవరిని ఎంపిక చేస్తారో… త్వరలోనే తెలుస్తుంది.
ఒక మర్యాదపూర్వక కలయిక…ఒక కొత్త ఆశ!!
ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, మా నాయకుడు శ్రీ @naralokesh గారిని అమ్మ దేవినేని అపర్ణ గారు, నా సతీమణి దేవినేని మహితతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. pic.twitter.com/80hfV9ddAj
— Chandu Devineni (@chandudevineni) September 10, 2026





