‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఒక మనసు’ వంటి చిత్రాలతో పక్కా ‘ఎ’ క్లాస్ ఆడియన్స్ సినిమాలను అందించిన దర్శకుడు రామరాజు తన తదుపరి సినిమాతో మాత్రం ‘బి, సి’ సెంటర్ ప్రేక్షకులను టార్గెట్ చేయనున్నారు. ఒక మాస్ కధతో “చీకటి ప్రేమకధ” అనే సినిమాను తెరకెక్కించబోతున్నానని స్వయంగా రామరాజే ప్రకటించారు. ‘ఒక మనసు’ సినిమాను నిర్మించిన మధుర శ్రీధర్ రెడ్డే ఈ ‘చీకటి ప్రేమకధ’ను కూడా నిర్మించబోతున్నారు.
అయితే ఇందులో తారాగణం ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తి నెలకొంది. ‘ఒక మనసు’ సినిమాకు పనిచేసిన సాంకేతిక వర్గమే దాదాపుగా ఇందులో కూడా భాగస్వామి అవుతుండడంతో, మెగా హీరోయిన్ గా లాంచ్ అయిన నిహారికనే ఈ ‘చీకటి ప్రేమకధ’లో భాగస్వామిని చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాతో అయిన దర్శకుడిగా రామరాజు మరో మెట్టు ఎదుగుతారో లేదో చూడాలి.
వరుసగా తీసిన రెండు క్లాస్ సినిమాలతో మంచి పేరు వచ్చింది తప్ప, దర్శకుడిగా అనూహ్యమైన అవకాశాలు మాత్రం దరిచేరలేదు. దీంతో ‘చీకటి ప్రేమకధ’ రామరాజులోని చీకటి మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తుందేమో చూడాలి. ‘ఒక మనసు’ సినిమా నిర్మాత మధుర శ్రీధర్ కు ఆర్ధికంగా ఎలాంటి నష్టాలను మిగల్చకపోవడంతో, ఈ సినిమాను కూడా ఆయనే నిర్మించడానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది.



