టిడిపి, జనసేనలు పొత్తులను వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. పొత్తులు, సీట్ల సర్దుబాట్ల కారణంగా టిడిపి, జనసేనలలో టికెట్లు దక్కనివారు లేదా త్యాగాలు చేయాల్సినవారు వ్యతిరేకిస్తున్నా అర్దం చేసుకోవచ్చు.
కానీ రాష్ట్రంలో కాపులందరికీ తామే ఏకైక ప్రతినిధులమన్నట్లు లేదా ‘శ్రేయోభిలాషులు’ ముసుగులో పవన్ కళ్యాణ్ని ఎలా నడుచుకోవాలో శాశించాలని అనుకుంటున్నవారు ఆయనకు తలనొప్పిగా మారారని చెప్పక తప్పదు.
శ్రేయోభిలాషులలో మొదటి వ్యక్తి కురువృద్ధుడు హరిరామ జోగయ్య. ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు, వైసీపి వ్యూహాల గురించి తెలిసే చెపుతున్నారో తెలియక మాట్లాడుతుంటారో కానీ పవన్ కళ్యాణ్కు శల్యసారధ్యం చేస్తూ, అప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డికి చాలా మేలు చేస్తున్నారు.
“రాష్ట్రంలో వైసీపిని గద్దె దించడం అంటే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయడమేనా?” అంటూ ఆయన పవన్ కళ్యాణ్కు చాలా ఘాటుగా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
టిడిపితో పొత్తులో భాగంగా జనసేన కనీసం 40-60 సీట్లు తీసుకోవాలని, ఆ మాత్రం సీట్లు లేకుండా కాపులకు ఎలా న్యాయం చేస్తారని దానిలో ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలను రాష్ట్రంలో అమలుచేయాలంటే ఆ మాత్రం సీట్లు తప్పనిసరి అని హరిరామ జోగయ్య సూచించారు. రాబోయే ఎన్నికలలో కాపులు జనసేనని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ వారి ఓట్లను చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
అంతేకాదు… చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెరో రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తామని సంయుక్త ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అని హరిరామ జోగయ్య ఆ లేఖలో ప్రశ్నించారు.
హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నవన్నీ జగన్మోహన్ రెడ్డి మనసులో మాటల్లాగే ఉన్నాయి తప్ప ఓ శ్రేయోభిలాషి హితవులా లేదు. ఎందుకంటే, జనసేన వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేస్తే వాటన్నిటినీ తామే గెలుచుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు.
అందుకే పవన్ కళ్యాణ్ పట్టుబట్టి 60-70 సీట్లు తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు వంటివారు శ్రేయోభిలాషులను ఎగద్రోస్తున్నారు.
ఆ ఉచ్చులో పడితే టిడిపి, జనసేనలు రెండూ కూడా ఎన్నికలలో నష్టపోతాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాబోయే 5 ఏళ్లలో వాటిని పూర్తిగా తుడిచిపెట్టేయడం కూడా ఖాయమే. పొంచి ఉన్న ఈ ప్రమాదం గురించి టిడిపి నేతలందరికీ బాగా తెలుసు. కానీ జనసేన ‘శ్రేయోభిలాషులకే’ ఇంకా అర్దమవడం లేదు. అందుకే ఇలా శల్య సారధ్యం చేస్తున్నారనుకోవచ్చు.
టిడిపి, జనసేనలు వైసీపిని ఓడించి అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఎన్ని సర్దుబాట్లు అయినా చేసుకోవచ్చు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందిప్పుడు.
కానీ అధికారంలోకి రాక ముందే విజయావకాశాన్ని దెబ్బ తీసుకోవాలనుకోవడం, కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది. కనుక నిజంగా పవన్ కళ్యాణ్, జనసేనల శ్రేయస్సు కోరే వారందరూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నిర్ణయాలకు కట్టుబడి ఉండటం చాలా చాలా అవసరం.
పవన్ కళ్యాణ్కు కూడా ఈవిదంగా తనకు శల్యసారధ్యం చేస్తున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే రేపు ఎన్నికలలో టిడిపి, జనసేనలు ఓడిపోతే నష్టపోయేది ఆ రెండు పార్టీలే. దానికి మూల్యం చెల్లించాల్సింది కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లే తప్ప శ్రేయోభిలాషులు కారు. వారందరూ ఎలా ప్రత్యక్షమయ్యారో అలాగే ఓటమి తర్వాత మాయం అయిపోతారు కూడా!






